
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఎ) కింద ఈ కేసులో పలువురు ప్రముఖుల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది.
ఈ కేసులో భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, టీఎంసీ మాజీ ఎంపీ మిమి చక్రవర్తి, నటుడు సోను సూద్, నటి నేహా శర్మ, మోడల్ ఊర్వశి రౌతేలా తల్లి, బెంగాలీ నటుడు అంకుష్ హజ్రాకు సంబంధించిన మొత్తం రూ.7.93 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
ఈడీ వర్గాల సమాచారం ప్రకారం, యువరాజ్ సింగ్కు చెందిన రూ.2.5 కోట్ల ఆస్తులు, రాబిన్ ఉతప్పకు చెందిన రూ.8.6 లక్షలు, సోను సూద్కు సంబంధించిన రూ.1 కోటి, మిమి చక్రవర్తికి చెందిన రూ.59 లక్షలు, అంకుష్ హజ్రాకు చెందిన రూ.47.20 లక్షలు, నేహా శర్మకు సంబంధించిన రూ.1.26 కోట్ల ఆస్తులు జప్తు చేయబడ్డాయి. అదేవిధంగా, ఊర్వశి రౌతేలా తల్లి పేరు మీద ఉన్న రూ.2.02 కోట్ల విలువైన ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది.
ఇదే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో గతంలో క్రికెటర్లు శిఖర్ ధావన్కు సంబంధించిన రూ.4.55 కోట్ల ఆస్తులు, సురేష్ రైనాకు చెందిన రూ.6.64 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఇప్పటికే జప్తు చేసిన విషయం తెలిసిందే. ఈ తాజా చర్యతో ఈ కేసులో ఇప్పటివరకు ఈడీ అటాచ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.19 కోట్లను దాటింది.
ఈ కేసుకు సంబంధించి ఈ ప్రముఖులను గతంలో ఈడీ పలుమార్లు విచారించింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో మాజీ క్రికెటర్లు, సినీ నటుల ఆస్తులను ఈడీ జప్తు చేయడం ప్రస్తుతం విస్తృత చర్చకు దారి తీసింది.
మరిన్ని వార్తలు చదవండి: దేశవాళీ క్రికెట్లో ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ!