5 Star Cricketers Likely to Retire in 2026 – Shocking Names Revealed

క్రికెట్ ప్రపంచం మరో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతోంది. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వంటి మెగా టోర్నీలు అభిమానులను ఉర్రూతలూగించాయి. ఇప్పటికే భారత క్రికెట్కు కీలకమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలికారు. అదే సమయంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు.
అయితే అసలు షాక్ మాత్రం 2026లో ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఫామ్ లోపం కావచ్చు, వయస్సు ప్రభావం కావచ్చు… ఐదుగురు స్టార్ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పే అవకాశం ఉందని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ జాబితాలోని పేర్లు వింటే అభిమానులు ఆశ్చర్యపోవడం ఖాయం.
సూర్యకుమార్ యాదవ్ :
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేరు ఈ లిస్ట్లో ఉండటం నిజంగా ఆశ్చర్యకరం. 2026 టీ20 వరల్డ్ కప్లో భారత్కు నాయకత్వం వహించబోతున్న సూర్య, ఇటీవల ఫామ్ కోల్పోయారు. గత 25 మ్యాచ్ల్లో ఆయన కేవలం 244 పరుగులే చేశారు. 2024 బంగ్లాదేశ్ సిరీస్ తర్వాత ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు కాలేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వరల్డ్ కప్ అనంతరం తన కెరీర్పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
గ్లెన్ మాక్స్వెల్ :
ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాటర్ గ్లెన్ మాక్స్వెల్ ఇప్పటికే వన్డేలకు వీడ్కోలు పలికారు. 37 ఏళ్ల మాక్స్వెల్ 2017 తర్వాత టెస్టులు ఆడలేదు. ప్రస్తుతం కేవలం టీ20లకే పరిమితమయ్యారు. 2026 టీ20 వరల్డ్ కప్ ఆయనకు చివరి అంతర్జాతీయ టోర్నీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 2028 వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలంటే మాక్స్వెల్ తప్పుకోవాల్సి రావచ్చు.
డేవిడ్ మిల్లర్ :
దక్షిణాఫ్రికా ‘కిల్లర్ మిల్లర్’గా పేరొందిన డేవిడ్ మిల్లర్ 2010 నుంచి జట్టుకు కీలకంగా నిలుస్తున్నారు. 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో టైటిల్ చేజారిన బాధ ఆయనను ఇప్పటికీ వెంటాడుతోంది. 2026 వరల్డ్ కప్లో దేశానికి కప్పు అందించాలనే లక్ష్యంతో ఉన్న మిల్లర్, ఆ టోర్నీ అనంతరం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశాలు బలంగా ఉన్నాయి.
మహ్మద్ నబీ :
ఆఫ్ఘనిస్తాన్ వెటరన్ ఆల్రౌండర్ మహ్మద్ నబీ ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీనే తన చివరి వన్డే టోర్నీగా ప్రకటించారు. ఆ తర్వాత మరో ఏడాది పాటు టీ20లు ఆడతానని స్పష్టం చేశారు. ఈ లెక్కన చూస్తే 2026 టీ20 వరల్డ్ కప్తో నబీ తన దీర్ఘకాల అంతర్జాతీయ కెరీర్కు ముగింపు పలకడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
అజింక్య రహానే :
భారత వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే 2023 జూలై తర్వాత టీమిండియా జెర్సీ ధరించలేదు. వైట్ బాల్ క్రికెట్లో ఆయనకు అవకాశం రావడం దాదాపు అసాధ్యంగా మారింది. టెస్టుల్లోనూ యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తుండటంతో రహానేకు తలుపులు మూసుకుపోయాయి. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో కొనసాగుతున్నప్పటికీ, 2026లో అంతర్జాతీయ క్రికెట్కు అధికారికంగా వీడ్కోలు పలికే అవకాశం ఉంది.
మరిన్నివార్తలుచదవండి: అర్జున్ టెండూల్కర్ బౌలింగ్పై దాడి.. సర్ఫరాజ్ ఖాన్ రికార్డ్ బ్రేకింగ్ షో