
జాతీయ జట్టుకు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి దేశవాళీ క్రికెట్లో తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025 వన్డే టోర్నీ కోసం బెంగాల్ జట్టులో షమీకి చోటు దక్కింది. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీల్లో చూపించిన అద్భుత ఫామ్ను ఈ దేశవాళీ వన్డే టోర్నీలోనూ కొనసాగించాలని షమీ లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ప్రస్తుతం ఈ బెంగాల్ స్పీడ్ స్టార్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. దేశవాళీ క్రికెట్లో నిరంతరం ప్రభావవంతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. ఈ సీజన్లో అన్ని ఫార్మాట్లను కలిపి మొత్తం 36 వికెట్లు పడగొట్టాడు. రంజీ ట్రోఫీలో నాలుగు మ్యాచ్లు ఆడి 20 వికెట్లు తీసిన షమీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 16 వికెట్లు సాధించి బెంగాల్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు.
బెంగాల్ జట్టులో షమీతో పాటు భారత పేసర్లు ఆకాశ్ దీప్, ముఖేష్ కుమార్ కూడా ఎంపికయ్యారు. జట్టుకు అనుభవజ్ఞుడు అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. బెంగాల్ జట్టు ఎలైట్ గ్రూప్ బిలో పోటీపడనుంది. ఈ టోర్నీలో బెంగాల్ తన తొలి మ్యాచ్ను ఈ నెల 24న రాజ్కోట్ వేదికగా ఆడనుంది.
షమీ విషయానికి వస్తే, చివరిసారిగా ఆయన భారత జట్టు తరఫున ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యలను కారణంగా చూపుతూ అతన్ని జాతీయ జట్టులోకి తీసుకోవడం లేదు. అయితే షమీ మాత్రం దేశవాళీ క్రికెట్లో క్రమం తప్పకుండా ఆడుతూ తన సత్తాను చాటుకుంటున్నాడు. ప్రస్తుతం భారత జట్టులో సీనియర్ ఫాస్ట్ బౌలర్ల కొరత స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో, షమీ ఫామ్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
విజయ్ హజారే ట్రోఫీ 2025కు బెంగాల్ జట్టు ఈ విధంగా ఉంది.
అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్గా, అనుస్తుప్ మజుందార్, అభిషేక్ పోరెల్ వికెట్ కీపర్గా, సుదీప్ ఘరామి, సుమంత్ గుప్తా, సుమిత్ నాగ్ వికెట్ కీపర్గా, చంద్రహాస్ డాష్, షాబాజ్ అహ్మద్, కరణ్ లాల్, మహ్మద్ షమీ, ఆకాశ్ దీప్, ముఖేష్ కుమార్, సయన్ ఘోష్, రవి కుమార్, అమీర్ ఘనీ, విశాల్ భాటి, అంకిత్ మిశ్రా జట్టులో ఉన్నారు.
మరిన్ని వార్తలు చదవండి: భారత్-న్యూజీలాండ్ వన్డే సిరీస్ 2026: జట్టు, స్టార్ క్రికెటర్ల విశ్రాంతి, తేదీలు మరియు షెడ్యూల్