Abhishek Sharma and Jasprit Bumrah Health Update Ahead of T20 World Cup Matches

టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ అంటే ప్రత్యర్థి బౌలర్లకు భయం తప్పదు. క్రీజులోకి అడుగుపెట్టిన క్షణం నుంచే దూకుడు బ్యాటింగ్తో ఫోర్లు, సిక్సులు బాదుతూ పరుగుల వరద పారించడమే అతని శైలి. అందుకే మ్యాచ్ ప్రారంభానికి ముందే ప్రత్యర్థి జట్లు అతన్ని త్వరగా పెవిలియన్కు పంపించేందుకు ప్రత్యేక వ్యూహాలతో సిద్ధమవుతుంటాయి.
ఇటీవల జరిగిన టీ20 టోర్నీల్లో అద్భుత ఫామ్లో కనిపించిన అభిషేక్ శర్మ, టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో యూఎస్ఏపై ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఓపెనర్గా బరిలోకి దిగిన అభిషేక్ శర్మ డకౌట్గా వెనుదిరిగాడు.
ఈ మ్యాచ్లో మరో విశేషం ఏమిటంటే, భారత్ ఫీల్డింగ్ సమయంలో అభిషేక్ శర్మ మైదానంలో కనిపించకపోవడం. దీంతో అతనికి గాయమైందా అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. ఈ అంశంపై మ్యాచ్ అనంతరం మాట్లాడిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మతో పాటు జస్ప్రీత్ బుమ్రా కూడా స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు. ఫిబ్రవరి 12న నమీబియాతో జరిగే తదుపరి మ్యాచ్లో వారు ఆడే అంశంపై మరో రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు.
ఇదే విషయంపై భారత బౌలర్ మహమ్మద్ సిరాజ్ మీడియాతో మాట్లాడుతూ అభిషేక్ శర్మ పరిస్థితిపై వివరాలు వెల్లడించాడు. అభిషేక్ కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నాడని, అందుకే ఫీల్డింగ్ సమయంలో మైదానంలోకి రాలేదని తెలిపారు. అయితే వచ్చే మ్యాచ్లో బ్యాట్తో మ్యాజిక్ చేస్తాడని సిరాజ్ నమ్మకం వ్యక్తం చేశాడు.
సూర్యకుమార్ యాదవ్, సిరాజ్ వ్యాఖ్యలను పరిశీలిస్తే, అభిషేక్ శర్మకు తీవ్రమైన గాయం ఏమీ లేదని స్పష్టమవుతోంది. స్వల్ప అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకుంటే తదుపరి మ్యాచ్లో తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఆ తరువాతి మ్యాచ్లకు అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
మరిన్నివార్తలుచదవండి: టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ ఘన విజయం సూర్యకుమార్ యాదవ్ అజేయ 84తో చరిత్ర