Annabel Sutherland Regains No.1 Spot in ICC Women’s T20 Bowling Rankings

ఐసీసీ మహిళల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్ మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్లో భారత్ స్టార్ ఆల్రౌండర్ దీప్తీ శర్మను వెనక్కి నెట్టి ఆమె నంబర్ వన్ స్థానంలో నిలిచింది.
సదర్లాండ్ 736 పాయింట్లతో టాప్ ర్యాంక్లో కొనసాగుతుండగా, దీప్తీ శర్మ 735 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ ఇద్దరి మధ్య కేవలం ఒక్క పాయింట్ మాత్రమే తేడా ఉంది. ఇటీవల శ్రీలంక మహిళలతో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో దీప్తీ శర్మ పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఆ సిరీస్లో ఆమె మొత్తం ఐదు వికెట్లు మాత్రమే సాధించింది.
ఇదే ర్యాంకింగ్స్లో మరో ఇద్దరు భారత బౌలర్లు దిగజారారు. రేణుకా సింగ్ ఠాకూర్ ఐదు స్థానాలు తగ్గి 11వ స్థానానికి పడిపోగా, రాధా యాదవ్ రెండు స్థానాలు తగ్గి 18వ స్థానంలో నిలిచింది.
అయితే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో మాత్రం భారత మహిళలు మెరిశారు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో అద్భుతంగా ఆడిన భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ రెండు స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్కు చేరుకుంది. ఈ సిరీస్లో వరుసగా మూడు అర్ధ సెంచరీలు సాధించిన షఫాలీ వర్మ తన ఆరో స్థానాన్ని మరింత బలపరుచుకుంది.
ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో హైదరాబాద్ క్రికెటర్ అరుంధతి రెడ్డి సత్తా చాటింది. ఆమె ఏకంగా 44 స్థానాలు ఎగబాకి 21వ ర్యాంక్కు చేరుకోవడం విశేషం.
మరిన్నివార్తలుచదవండి: WPL 2026 టికెట్లు రూ.100 నుంచే | మ్యాచ్లు నవీ ముంబై, వడోదరలో