Ashes 2025-26: England Players Under Fire for Alcohol Allegations During Ashes 2025

ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ 2025–26 సిరీస్లో ఇంగ్లాండ్ జట్టు ఎదుర్కొంటున్న పరాజయాలకంటే, ఇప్పుడు వారి ఆటగాళ్ల ప్రవర్తనే పెద్ద చర్చకు దారి తీస్తోంది. వరుసగా మూడు టెస్టుల్లో ఓడి సిరీస్ను ఇప్పటికే కోల్పోయిన ఆంగ్ల జట్టు, ఆటపై దృష్టి పెట్టాల్సిన సమయంలో విందులు–వినోదాల్లో మునిగిపోయిందన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సిరీస్ మధ్యలో దొరికిన విరామంలో ఆటగాళ్లు ఏకంగా ఆరు రోజుల పాటు అతిగా మద్యం సేవించారన్న వార్తలతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు విచారణకు ఆదేశించింది.
ఈ యాషెస్లో ఇంగ్లాండ్ ప్రదర్శన పూర్తిగా నిరాశపరిచింది. పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్ టెస్టుల్లో వరుస ఓటములతో 3–0 తేడాతో సిరీస్ను ఆస్ట్రేలియాకు అప్పగించింది. అయితే బ్రిస్బేన్ టెస్టు తర్వాత అడిలైడ్ టెస్టుకు మధ్య దొరికిన తొమ్మిది రోజుల విరామంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు క్వీన్స్లాండ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం నూసాకు వెళ్లారు.
అక్కడ విశ్రాంతి తీసుకోవాల్సిన వారు, ఆరు రోజుల పాటు నిరంతరంగా మద్యం సేవిస్తూ పార్టీలు చేసుకున్నారని బ్రిటిష్ మీడియా ఆరోపిస్తోంది. ఇది కేవలం బ్రేక్లా కాకుండా బ్యాచిలర్ పార్టీలా సాగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఓపెనర్ బెన్ డకెట్ మత్తులో తూలుతూ కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోలో అతడు తన హోటల్కు ఎలా చేరుకోవాలో కూడా తెలియని స్థితిలో ఉన్నట్లు కనిపించడంతో వివాదం మరింత ముదిరింది.
మరో యువ ఆటగాడు జాకబ్ బెథెల్ క్లబ్లో డ్యాన్స్ చేస్తూ కనిపించడం కూడా అభిమానుల ఆగ్రహాన్ని పెంచింది. సిరీస్ చేజారిన కీలక సమయంలో ఆటగాళ్లు ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించడంపై ఇంగ్లాండ్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.
Duckket helping the economy big time pic.twitter.com/FXyoMUyjIx
— Liverwood (@21_liverwood) December 23, 2025
ఈ వ్యవహారంపై ఇంగ్లాండ్ క్రికెట్ డైరెక్టర్ రాబ్ కీ స్పందిస్తూ, “అంతర్జాతీయ స్థాయిలో ఆడే ఆటగాళ్లు ఇంతగా మద్యం సేవించడం అస్సలు ఆమోదయోగ్యం కాదు. భోజనం సమయంలో ఒక గ్లాసు వైన్ తీసుకోవడంలో తప్పేమీ లేదు.
కానీ ఇప్పుడు వస్తున్న వార్తలు మితిమీరిన ప్రవర్తనను సూచిస్తున్నాయి. దీనిపై పూర్తి స్థాయిలో అంతర్గత విచారణ జరుపుతాం” అని స్పష్టం చేశారు. గతంలో న్యూజిలాండ్ టూర్లోనూ ఇలాంటి ఘటనల కారణంగా వైట్బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్ హెచ్చరికలు పొందిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.
ఇప్పటికే ఆస్ట్రేలియా తొలి మూడు టెస్టులను గెలిచి యాషెస్ ట్రోఫీని నిలుపుకుంది. కేవలం 11 రోజుల్లోనే సిరీస్ ఫలితం తేలిపోవడం ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలోనే ఒక అవమానకరమైన అధ్యాయంగా నిలిచింది.
ఇప్పుడు దీనికి తోడు ఆటగాళ్ల క్రమశిక్షణ లోపం బయటపడటంతో హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తీసుకున్న నిర్ణయాలపై కూడా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మెల్బోర్న్ వేదికగా జరగనున్న బాక్సింగ్ డే టెస్టుకు ముందే ఈ వివాదం ఇంగ్లాండ్ జట్టును మరింత ఒత్తిడిలోకి నెట్టింది.
మరిన్ని వార్తలు చదవండి: కేన్ విలియమ్సన్ అవుట్! వన్డేలకు నో చెప్పిన న్యూజిలాండ్ స్టార్..