IPL

Ashes Series 2025-26: బాక్సింగ్ డే టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు షాక్.. .. కీలక ఆటగాడు దూరం?

by Guna SRV

యాషెస్ సిరీస్‌ 2025–26ను ఇప్పటికే కైవసం చేసుకుని ఉత్సాహంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. ఈ సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టులకు ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అడిలైడ్ వేదికగా జరిగిన మూడో టెస్టు ఐదో రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో లియోన్ తొడ కండరాలకు గాయం కావడంతో అకస్మాత్తుగా అసౌకర్యానికి గురయ్యాడు.

గాయం తీవ్రంగా ఉండటంతో ఫిజియో సహాయంతో లియోన్ మైదానాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. అయితే మ్యాచ్ అనంతరం అతడు క్రచెస్ సహాయంతో నడుస్తూ కనిపించడం అభిమానులను మరింత ఆందోళనకు గురిచేసింది. ఈ దృశ్యం చూస్తే అతడి గాయం సాధారణమైనది కాదని స్పష్టమవుతోంది.

ఇప్పటికే జోష్ హాజిల్‌వుడ్, స్టీవ్ స్మిత్ వంటి కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడగా, ఆస్ట్రేలియా జట్టు గాయాల సమస్యతో సతమతమవుతోంది. అయితే డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్ వేదికగా జరగనున్న బాక్సింగ్ డే టెస్టుకు స్టీవ్ స్మిత్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని సమాచారం. స్మిత్ తిరిగి జట్టులోకి వస్తే జాక్ వెదరాల్డ్‌పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి.

నాథన్ లియోన్ గాయంపై ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ స్పందించాడు.

“నాథన్‌కు ఇలా జరగడం చాలా బాధాకరం. అడిలైడ్ టెస్టు విజయంలో అతడి పాత్ర కీలకం. అతడికి పూర్తి క్రెడిట్ ఇవ్వాల్సిందే. ప్రస్తుతం అతడు మళ్లీ రిహాబిలిటేషన్ ప్రక్రియలోకి వెళ్లనున్నాడు. గతంలోనూ అతడు పిక్క గాయం నుంచి కోలుకున్నాడు. కాబట్టి కోలుకునే విధానంపై అతడికి పూర్తి అవగాహన ఉంది. ఇంకా కొన్నేళ్లు ఆస్ట్రేలియా క్రికెట్‌కు సేవలందించాలని అతడు కోరుకుంటున్నాడు. లియోన్ త్వరగా కోలుకుని మళ్లీ మైదానంలోకి రావాలని ఆశిస్తున్నాను” అని స్టార్క్ తెలిపాడు.

మూడో టెస్టులో లియోన్ అద్భుత ప్రదర్శనతో మెరిశాడు. మొత్తం ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ ఓటమికి ప్రధాన కారణమయ్యాడు. తొలి మూడు టెస్టుల్లో వరుసగా గెలిచిన ఆస్ట్రేలియా, యాషెస్ సిరీస్‌ను 3-0 తేడాతో రిటైన్ చేసుకుని ఆధిపత్యాన్ని చాటింది.

మరిన్ని వార్తలు చదవండి: