Bangladesh Cricket Board Removes Nazmul Islam After Controversial Remarks on Players

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెటర్లను కించపరిచే వ్యాఖ్యలు చేసిన బోర్డు ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్ మరియు డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాంను ఆయన పదవి నుంచి తొలగించింది. అతడి స్థానంలో బీసీబీ చైర్మన్ అమీనుల్ ఇస్లాం తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో బోర్డు మరియు ఆటగాళ్ల మధ్య నెలకొన్న వివాదానికి తాత్కాలికంగా ముగింపు పలికినట్లైంది.
వివాదానికి కారణం ఏమిటి?
ఐపీఎల్ 2026 సీజన్కు ముందు బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ను బీసీసీఐ ఆదేశాల మేరకు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విడుదల చేసింది. దీనిపై స్పందించిన బంగ్లా క్రికెట్ బోర్డు, భారత్లో తమ జట్టుకు భద్రత లేదని పేర్కొంటూ తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై ప్రస్తుతం ఐసీసీ మరియు బీసీబీ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ భావోద్వేగాలకు లోనుకాకుండా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించాడు. అయితే ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన నజ్ముల్ ఇస్లాం, సోషల్ మీడియా వేదికగా తమీమ్ను “ఇండియన్ ఏజెంట్” అంటూ వ్యాఖ్యానించాడు.
క్రికెటర్ల ఆగ్రహం
దేశానికి 16 ఏళ్ల పాటు సేవలందించిన ఆటగాడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల క్రికెటర్ల సంక్షేమ సంఘం (సీడబ్ల్యూఏబీ) తీవ్రంగా స్పందించింది. పలువురు క్రికెటర్లు కూడా నజ్ముల్ వ్యాఖ్యలను ఖండించారు. అయినప్పటికీ నజ్ముల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాడు.
"బంగ్లాదేశ్ జట్టు వరల్డ్ కప్లో పాల్గొనకపోయినా బోర్డుకు పెద్ద నష్టం ఏమీ ఉండదు. ఐసీసీ నుంచి రావాల్సిన సుమారు రూ. 290 కోట్ల ఆదాయం ఎలాగైనా వస్తుంది. కానీ ఆటగాళ్లే నష్టపోతారు. ఈ అవకాశాన్ని కోల్పోతే వారికి ఎలాంటి పరిహారం ఉండదు. బోర్డు ఆటగాళ్లపై కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ ప్రతి ఐసీసీ టోర్నీలో జట్టు విఫలమవుతోంది. అప్పుడు మేము ఆటగాళ్లను డబ్బు తిరిగి చెల్లించమని అడగడం లేదుగా?" అని నజ్ముల్ వ్యాఖ్యానించాడు.
ఈ వ్యాఖ్యలపై క్రికెటర్ల సంక్షేమ సంఘం మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నజ్ముల్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, అలా చేయకపోతే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు మరియు అంతర్జాతీయ మ్యాచ్లను కూడా బహిష్కరిస్తామని ఆటగాళ్లు స్పష్టం చేశారు.
నజ్ముల్కు షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ ఆటగాళ్లు తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ క్రమంలో గురువారం జరగాల్సిన రెండు బీపీఎల్ మ్యాచ్లు వాయిదా పడ్డాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన బోర్డు పెద్దలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నజ్ముల్ ఇస్లాంను పదవి నుంచి తొలగించారు.
మరిన్నివార్తలుచదవండి: Washington Sundar గాయం: న్యూజిలాండ్ టీ20 సిరీస్కు దూరం.. వరల్డ్కప్ అనుమానం