IPL

Bangladesh Cricketers Face Sponsorship Shock As SG May Withdraw Support

by Krishna R

భారత్, బంగ్లాదేశ్ మధ్య క్రికెట్‌తో పాటు దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెటర్లకు పెద్ద షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ క్రికెటర్లకు ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న భారత కంపెనీ ఎస్‌జీ తమ స్పాన్సర్‌షిప్‌ను కొనసాగించకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం లిటన్ దాస్, మొమినుల్ హక్, యాసిర్ అలీ వంటి స్టార్ ఆటగాళ్లకు ఎస్‌జీ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. అయితే ఒప్పందాన్ని పునరుద్ధరించకూడదనే నిర్ణయాన్ని ఇంకా అధికారికంగా ఆటగాళ్లకు తెలియజేయలేదు. అయినప్పటికీ వారి ఏజెంట్లు ఈ పరిణామంపై సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఎస్‌జీ స్పాన్సర్‌గా తప్పుకోవచ్చని ఓ బంగ్లాదేశ్ క్రికెటర్ ప్రముఖ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ తెలిపినట్లు వార్తలు వెలువడ్డాయి. ఎస్‌జీ ఈ నిర్ణయం తీసుకుంటే ఇతర సంస్థలు కూడా అదే దారిలో నడిచే అవకాశం ఉందని అతడు అభిప్రాయపడ్డాడు.

ఇటీవల బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత నెలకొంది. ఈ సమయంలో హిందువులపై వరుసగా దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ దాడుల్లో పలువురు హిందువులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్‌లో ఆడకుండా నిషేధించాలని డిమాండ్లు రావడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ ఆదేశాల మేరకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ముస్తాఫిజుర్‌ను విడుదల చేసింది.

ఈ నిర్ణయంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో మ్యాచ్‌లు ఆడలేమని, తమ జట్టు మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు లేఖ రాసింది. అయితే ఈ అభ్యర్థనపై ఇప్పటివరకు ఐసీసీ ఎలాంటి స్పందన ఇవ్వలేదు.

మరిన్నివార్తలుచదవండిఅండర్ 19 ప్రపంచకప్ 2026: ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటన, మహబూబ్ ఖాన్ కెప్టెన్