IPL

Bangladesh Refuses to Play in India, T20 World Cup 2026 Controversy

by Krishna R

ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న 2026 ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ జట్టు పాల్గొనడం అనుమానాస్పదంగా మారింది. భద్రతా కారణాలను చూపిస్తూ భారత గడ్డపై అడుగు పెట్టేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఇప్పటికే పలు మార్లు ఐసీసీకి స్పష్టంగా తెలియజేసింది.

భారత్‌లో ఆడే విషయంలో తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని కూడా స్పష్టం చేసింది. అయితే, ఈ అంశంపై మరోసారి ఆలోచించుకునేందుకు ఐసీసీ బంగ్లాదేశ్‌కు అవకాశం ఇచ్చింది. జనవరి 21లోపు తుది నిర్ణయం తెలియజేయాలని డెడ్‌లైన్ విధించింది.

కానీ ఈ గడువు తమ నిర్ణయాన్ని మార్చదని బంగ్లాదేశ్ క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ స్పష్టంగా వెల్లడించారు. మంగళవారం (జనవరి 20) ఆయన మాట్లాడుతూ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తన వైఖరిలో ఎలాంటి మార్పు చేయబోదని ఖరాఖండిగా చెప్పారు.

వరల్డ్ కప్‌లో తమ స్థానాన్ని వేరే జట్టుతో భర్తీ చేస్తారనే హెచ్చరికలు వచ్చినప్పటికీ, భారత్‌కు వచ్చి క్రికెట్ ఆడబోమని నజ్రుల్ తేల్చిచెప్పారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన,
“భారత క్రికెట్ బోర్డు ఒత్తిడితో ఐసీసీ మాపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. షరతులు విధిస్తూ మమ్మల్ని బలవంతపెట్టాలని చూస్తే, అలాంటి షరతులను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం” అని వ్యాఖ్యానించారు. ఐసీసీ ఇచ్చిన గడువుకు కేవలం ఒక రోజే మిగిలి ఉండడంతో, బంగ్లాదేశ్ నిర్ణయం మరింత స్పష్టంగా బయటపడింది.

ఒకవేళ బంగ్లాదేశ్ భారత్‌కు రావడానికి తుది నిరాకరణ తెలిపితే, టీ20 వరల్డ్ కప్ నుంచి ఆ జట్టును తొలగించే అవకాశం ఉంది. అలా జరిగితే, ర్యాంకింగ్స్ ప్రకారం స్కాట్లాండ్ జట్టు బంగ్లాదేశ్ స్థానంలో టోర్నమెంట్‌లోకి వచ్చే అవకాశముంది.

భద్రతా సమస్యల కారణంగానే భారత్ పర్యటనకు వెనకడుగు వేస్తున్నామని బంగ్లాదేశ్ బోర్డు ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. సాధ్యమైన పరిష్కారం కోసం మరోసారి ఐసీసీతో చర్చలు జరపనున్నట్లు కూడా తెలిపింది. అయితే ఐసీసీ భద్రతపై హామీ ఇచ్చినా, భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ ఇంకా సిద్ధంగా లేదు.

ప్రస్తుతం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో మొత్తం నాలుగు లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీటిలో మూడు మ్యాచ్‌లు కోల్‌కతాలో, ఒక మ్యాచ్ ముంబైలో జరగనున్నాయి.

  • ఫిబ్రవరి 7 – వెస్టిండీస్‌తో (కోల్‌కతా)

  • ఫిబ్రవరి 9 – ఇటలీతో (కోల్‌కతా)

  • ఫిబ్రవరి 14 – ఇంగ్లాండ్‌తో (కోల్‌కతా)

  • ఫిబ్రవరి 17 – నేపాల్‌తో (ముంబై)

ఈ పరిణామాలతో బంగ్లాదేశ్ పాల్గొనడంపై సస్పెన్స్ మరింత పెరిగింది.

మరిన్ని వార్తలు చదవండి: భారత్‌తో టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్.. బ్రేస్‌వెల్ ఔట్!