IPL

BCCI Orders KKR to Release Mustafizur Rahman Ahead of IPL 2026

by Krishna R

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌ (KKR)కు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేకేఆర్ జట్టులో ఉన్న బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను విడుదల చేయాలని బీసీసీఐ స్పష్టంగా ఆదేశించింది.

ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధికారికంగా ధ్రువీకరించారు. వార్తా సంస్థ ANIతో మాట్లాడిన ఆయన, “ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేకేఆర్ తమ జట్టులోని బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను విడుదల చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఒకవేళ అతడి స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేయాలనుకుంటే, అందుకు అనుమతి కూడా ఇస్తున్నాం” అని తెలిపారు.

ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఐదుగురికి పైగా బంగ్లాదేశ్ ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నప్పటికీ, ఫామ్‌ మరియు గత ప్రదర్శనల ఆధారంగా ముస్తాఫిజుర్ రెహ్మాన్ మాత్రమే అమ్ముడుపోయాడు. కనీస ధర రూ.2 కోట్లతో వేలంలోకి వచ్చిన ఈ ఎడమచేతి పేస్ బౌలర్‌ను, ఇతర ఫ్రాంఛైజీలతో తీవ్ర పోటీ మధ్య కేకేఆర్ ఏకంగా రూ.9.20 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. తుదిజట్టులో అతడు ఆడటం దాదాపు ఖాయమే అనిపించిన వేళ, బీసీసీఐ తాజా నిర్ణయం కేకేఆర్‌కు ఊహించని షాక్‌గా మారింది.

ఈ నిర్ణయానికి నేపథ్యంగా బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రధాన కారణంగా మారాయి. అక్కడ మైనారిటీ వర్గమైన హిందువులపై దాడులు పెరుగుతున్నాయి. ఇప్పటికే కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కలకలం రేపాయి. మరోవైపు, కొందరు నేతలు భారత్‌ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం వల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఓ బీజేపీ నేత, కేకేఆర్ ఫ్రాంఛైజీ సహ యజమాని, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ కొనుగోలు చేసినందుకు ఆయనను ‘ద్రోహి’గా అభివర్ణించడం పెద్ద చర్చకు దారి తీసింది. దీంతో ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ నుంచి విడుదల చేయాలనే డిమాండ్లు మరింత బలపడ్డాయి.

ఈ ఒత్తిళ్ల మధ్య బీసీసీఐ తాజాగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఐపీఎల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముస్తాఫిజుర్ స్థానాన్ని కేకేఆర్ ఎవరితో భర్తీ చేస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. మూడుసార్లు ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్‌కు ఇది కీలక దశగా మారనుంది.

మరిన్ని వార్తలు చదవండి: 2026 ఆగస్టు–సెప్టెంబర్‌లో భారత్ బంగ్లాదేశ్ పర్యటన ఖరారు