IPL

BCCI Set for High-Level Review Meeting; Future of Rohit, Kohli and Senior Players Under Discussion

by IPL Web Desk

BCCI Set for High-Level Review Meeting; Future of Rohit, Kohli and Senior Players Under Discussionభారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) జట్టు భవిష్యత్తును నిర్ణయించే ముఖ్యమైన సమావేశానికి సిద్ధమవుతోంది. అన్ని ఫార్మాట్లలో జాతీయ జట్టుకు స్పష్టమైన రోడ్‌మ్యాప్ రూపొందించడమే లక్ష్యం. ఏడాది వ్యవధిలో రెండోసారి ఇంటి మైదానంలో టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడిపోయిన తర్వాత బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఈసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 పాయింట్ల టేబుల్‌లో అగ్రస్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా చేతిలో భారత్ వైట్‌వాష్ అయింది.

2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్, తర్వాత 2027 ఒడివో వరల్డ్ కప్ సన్నాహాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కోచ్, సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ అందరూ ఒకే దారిలో నడిచేలా బోర్డు కసరత్తు చేస్తోంది.

స్పోర్ట్‌స్టార్ వార్త ప్రకారం, బుధవారం (ఇండియా-దక్షిణాఫ్రికా రెండో వన్డే మ్యాచ్ రోజునే) జరగబోయే ఈ సమావేశంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, జాయింట్ సెక్రటరీ ప్రభ్‌తేజ్ భాటియా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పాల్గొంటారు. సీనియర్ ఆటగాళ్లను ఈ మీటింగ్‌కు పిలవడం లేదు. బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మాన్‌హాస్ వస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు.

సీనియర్ల భవిష్యత్‌పై అనిశ్చితి: రోహిత్–కోహ్లీ–జడేజా పాత్ర ఏంటి?

ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో “మైదానంలోనూ, బయట కూడా కన్ఫ్యూజ్ చేసే నిర్ణయాలు” తీసుకున్నామని ఓ బోర్డు అధికారి అంగీకరించారు. మరో ఎనిమిది నెలల వరకు టెస్టు మ్యాచ్‌లు లేని ఈ టైమ్‌లోనే వ్యూహాలను సరిచేసుకోవడం, నిర్ణయాలు సులువుగా తీసుకునేలా చేయడం, అన్ని ఫార్మాట్లలో ఒకేలా ఆలోచించేలా చూడడం సరైన సమయమని బోర్డు భావిస్తోంది.

దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో టాక్టిక్స్, సెలక్షన్ నిర్ణయాలపై గంభీర్, అగార్కర్‌లపై విమర్శలు వచ్చాయి. టెస్టులతోపాటు వన్డే జట్టులోనూ పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి సీనియర్ల భవిష్యత్తు ఏమిటి? మేనేజ్‌మెంట్-సీనియర్ ఆటగాళ్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని బోర్డు కూడా అంగీకరించింది. ఈ సమస్యలను పరిష్కరించడమే సమావేశం ముఖ్య ఎజెండా.

వచ్చే రెండేళ్లలో జట్టు ఎలా మారనుంది? ఎప్పుడు ట్రాన్సిషన్ మొదలవుతుంది? ఎన్నో ఐసీసీ ఈవెంట్లు లైన్‌లో ఉన్న నేపథ్యంలో స్థిరమైన, దీర్ఘకాలిక ప్లాన్ ఉండాలని బోర్డు కోరుకుంటోంది.

“వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ డిఫెండ్ చేయడానికి ఇండియానే ఫేవరెట్. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్‌లోనూ మనమే బలమైన పోటీదారులం. అందుకే ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాలి” అని ఆ బోర్డు అధికారి చెప్పారు. దీర్ఘకాలిక ప్లానింగ్, స్పష్టత కోసం బీసీసీఐ తొందరపడుతోందని స్పష్టమవుతోంది.