BCCI Shifts SMA Trophy 2025-26 Knockout Matches to Pune
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2025-26 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ (ఎస్ఎంఏటీ) నాకౌట్ దశ మ్యాచ్ల వేదికల్లో మార్పు చేసింది. ముందుగా డిసెంబర్ 12 నుంచి 18 వరకు సూపర్ లీగ్తో సహా చివరి 13 మ్యాచ్లను ఇండోర్లోని హోల్కర్ స్టేడియం, ఎమరాల్డ్ హైస్కూల్ మైదానంలో నిర్వహించాలని నిర్ణయించారు.
కానీ మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఎంపీసీఏ) బీసీసీఐకి తాము ఈ మ్యాచ్లు నిర్వహించలేమని రెండు వారాల క్రితమే తెలిపేసింది. కారణం – డిసెంబర్ 9 నుంచి 12 వరకు ఇండోర్లో జరగబోతున్న అంతర్జాతీయ వైద్యుల సదస్సు. ఈ సమావేశం వల్ల నగరంలో హోటల్ రూములు ఏమాత్రం దొరకడం లేదు. దాంతో టాప్ ఆటగాళ్లు, అధికారులకు బస సమస్య తలెత్తుతుందని ఎంపీసీఏ అంచనా వేసింది.
మిగతా మ్యాచ్లు MCA స్టేడియం, డా. డి.వై. పటిల్ అకాడమీ లో
చివరకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది – మొత్తం నాకౌట్ దశనూ పూణేకి తరలించేసింది. ఇకపై గహుంజేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) స్టేడియం, అంబిలోని డాక్టర్ డీవై పాటిల్ అకాడమీ మైదానాల్లో అన్ని మిగిలిన మ్యాచ్లు జరుగుతాయి. టోర్నీ ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిపోతుందని బీసీసీఐ భరోసా ఇచ్చింది.
ఎంపీసీఏ సీఈవో రోహిత్ పాండిత్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో చెప్పిన మాటలు: “రెండు వారాల క్రితమే బీసీసీఐకి చెప్పేశాం. డిసెంబర్ 9–12 మధ్య ఇక్కడ పెద్ద డాక్టర్ల సమావేశం ఉంటుంది. హోటల్ రూములు దొరకడం లేదు. అందుకే నాకౌట్లు నిర్వహించలేమని స్పష్టంగా తెలియజేశాం.”
ఇదంతా జరుగుతున్న సమయంలో దేశంలో ప్రయాణ సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయి. ఇండిగో ఎయిర్లైన్స్ సాంకేతిక తడబాట్లు, వాతావరణ పరిస్థితులు, కొత్త క్రూ రోస్టర్ నిబంధనలతో దాదాపు వెయ్యి ఫ్లైట్లు ఆలస్యమైనాయి లేదా రద్దయ్యాయి. ఇలాంటి సంక్షోభం కొనసాగితే... అహ్మదాబాద్, కోల్కతా, లక్నో, హైదరాబాద్ నుంచి నాకౌట్కి అర్హత సాధించిన ఎనిమిది జట్లను, అంపైర్లను, అధికారులను పూణేకి తరలించడం బీసీసీఐకి పెద్ద తలనొప్పిగా మారవచ్చు.
ఈ విషయంపై టైమ్స్ ఆఫ్ ఇండియాకి మాట్లాడిన ఓ సన్నిహిత వర్గాలు ఇలా అన్నాయి: “ఇండిగో సమస్య ఇంకా తగ్గకపోతే ఎనిమిది జట్లతో పాటు అంపైర్లు, అధికారులు – అందర్నీ పూణేకి రప్పించడం కష్టమే. అంతే కాదు... అహ్మదాబాద్లో మహిళల అండర్-23 టీ20 ట్రోఫీ, మరోవైపు పురుషుల అండర్-19 కూచ్ బెహర్ ట్రోఫీ కూడా జోరుగా సాగుతున్నాయి. జట్లు, అధికారులు ఎప్పటికప్పుడు ఒక చోట నుంచి మరొక చోటికి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే... క్రికెట్ ఆడే ఆటగాళ్లు మాత్రమే కాదు, టోర్నీలు నిర్వహించే బీసీసీఐకి కూడా ఇప్పుడు పెద్ద సవాల్ మొదలైంది!