IPL

Big Bash League Set For Historic First Match In India At Chepauk

by IPL Web Desk

Big Bash League Set For Historic First Match In India At Chepaukచెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం మరో చారిత్రక ఘట్టానికి వేదిక కావడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న బిగ్ బాష్ లీగ్ 2026-27 సీజన్ ఆరంభ మ్యాచ్‌ను చెపాక్‌లో నిర్వహించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రతిపాదనకు తుది ఆమోదం లభిస్తే, భారతదేశంలో అధికారిక బీబీఎల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చే తొలి మైదానంగా చెపాక్ నిలవనుంది.

బిగ్ బాష్ లీగ్‌కు భారత మార్కెట్‌లో మరింత ఆదరణ తీసుకురావాలని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌ను ఆస్ట్రేలియా వెలుపల నిర్వహించే ఆలోచనకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చెన్నైను సరైన వేదికగా గుర్తించినట్లు గతంలోనే వార్తలు వెలువడ్డాయి.

ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఆ ప్రణాళిక అమలుకు మరింత దగ్గరపడింది. తమిళనాడు క్రికెట్ సంఘానికి చెందిన ఒక వర్గం తెలిపిన వివరాల ప్రకారం, డిసెంబర్ రెండో వారంలో బీబీఎల్ 16 ఆరంభ మ్యాచ్ చెపాక్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల క్రికెట్ ఆస్ట్రేలియాకు చెందిన ఐదుగురు సభ్యులతో కూడిన బృందం ఎంఏ చిదంబరం స్టేడియాన్ని సందర్శించింది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌ను కూడా వీక్షించింది. తొలుత ఆసక్తి చూపనట్లు కనిపించిన బీసీసీఐ, ఇప్పుడు ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

చెన్నై మ్యాచ్‌పై ఇంకా అధికారిక ప్రకటన లేదు

అయితే ఈ అంశంపై క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం బీసీసీఐతో చర్చలు కొనసాగుతున్నాయని ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు.

“భారత్-ఆస్ట్రేలియా సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఆస్ట్రేలియా ప్రభుత్వ భాగస్వామ్యంతో చెన్నై అవకాశాలను పరిశీలిస్తున్నాం. ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. బీసీసీఐతో చర్చలు కొనసాగుతున్నాయి,” అని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధి తెలిపారు.

ఇదిలా ఉండగా, బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ ప్రస్తుతం చెన్నైలో క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనపై కీలక చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధులు చెన్నైను సందర్శించి మైదాన పరిస్థితులను పరిశీలించినట్లు ఎస్ఈఎన్ క్రికెట్ వెల్లడించింది. షెడ్యూల్ సౌలభ్యం, భారత పెట్టుబడిదారుల ఆసక్తి కారణంగా పెర్త్ స్కార్చర్స్ జట్టు ఈ మ్యాచ్‌లో పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

సాధారణంగా బిగ్ బాష్ లీగ్ డిసెంబర్-జనవరి మధ్య నిర్వహిస్తారు. తుది అనుమతి లభిస్తే, ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మక మైదానాల్లో ఒకటైన చెపాక్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకోనుంది.