BPL 2025-26 Controversy: Noakhali Express Coaches Walk Out of Practice Session

బంగ్లాదేశ్లో ఒకవైపు రాజకీయ అల్లర్లు కొనసాగుతున్నా మరోవైపు క్రికెట్ అభిమానులకు వినోదం అందించేందుకు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) 12వ సీజన్ సిద్ధమైంది. బీపీఎల్ 2025-26 సీజన్ శుక్రవారం (డిసెంబర్ 26) ప్రారంభం కానుంది. ప్రారంభ రోజే రెండు మ్యాచ్లు జరగనున్నాయి. తొలి మ్యాచ్లో సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సిల్హెట్ టైటాన్స్, రాజ్షాహి వారియర్స్ తలపడతాయి.
ఆ తర్వాత జరిగే మ్యాచ్లో నోయాఖాలీ ఎక్స్ప్రెస్, ఛటోగ్రామ్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. నోయాఖాలీ ఎక్స్ప్రెస్ బీపీఎల్లో కొత్తగా చేరిన ఫ్రాంచైజీ కాగా.. ఈ సీజన్లోనే తొలిసారి బరిలోకి దిగుతోంది. అయితే తొలి మ్యాచ్కు ముందే ఈ జట్టుకు అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి.
ఛటోగ్రామ్ రాయల్స్తో జరగబోయే తొలి మ్యాచ్కు సిద్ధమయ్యేందుకు గురువారం నోయాఖాలీ ఎక్స్ప్రెస్ జట్టు సిల్హెట్ అంతర్జాతీయ స్టేడియానికి ప్రాక్టీస్ కోసం వెళ్లింది. కానీ ఆ ప్రాక్టీస్ సెషన్ మధ్యలోనే హెడ్ కోచ్ ఖలీద్ మహముద్, అసిస్టెంట్ కోచ్ తల్హా జుబేర్ స్టేడియం నుంచి బయటకు వచ్చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ప్రాక్టీస్కు అవసరమైనంత సంఖ్యలో క్రికెట్ బంతులు కూడా అందుబాటులో లేకపోవడంతో ఇద్దరూ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. బంగ్లాదేశ్ మాజీ పేసర్ అయిన ఖలీద్ మహముద్ గత సీజన్ వరకు ఢాకా క్యాపిటల్స్ హెడ్ కోచ్గా పని చేశాడు. అయితే ఈ సీజన్లో నోయాఖాలీ ఎక్స్ప్రెస్ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
కానీ సీజన్ ఆరంభంలోనే అతడికి చేదు అనుభవం ఎదురైంది. ప్రాక్టీస్కు జట్టుతో పాటు వెళ్లిన ఖలీద్ మహముద్తో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)కి చెందిన ఒక అధికారి దురుసుగా ప్రవర్తించాడని సమాచారం. దీంతో ఖలీద్ మహముద్, తల్హా జుబేర్ ఇద్దరూ స్టేడియం నుంచి బయటకు వచ్చి ఆటోలో వెళ్లిపోయారు.
ఈ ఘటనపై తల్హా జుబేర్ మీడియాతో మాట్లాడుతూ..
“నా కెరీర్లో ఎన్నో బీపీఎల్ సీజన్లు చూశాను. కానీ ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఇతరులు ఎలా ప్రవర్తించినా నాకు సంబంధం లేదు. కానీ ఇలాంటి వాతావరణంలో నేను కొనసాగలేను” అని స్పష్టం చేశారు.
అదే విధంగా హెడ్ కోచ్ ఖలీద్ మహముద్ కూడా స్పందిస్తూ..
“నేను బీపీఎల్ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నాను. ఇలాంటి అనుభవం నా కెరీర్లో ఎప్పుడూ చూడలేదు” అని వ్యాఖ్యానించారు.
అయితే కొన్ని గంటల తర్వాత పరిస్థితి మారింది. ఇద్దరి సన్నిహితుడి జోక్యంతో ఖలీద్ మహముద్, తల్హా జుబేర్ తమ నిర్ణయాన్ని మార్చుకుని తిరిగి మైదానానికి చేరుకున్నారు.
ఇదిలా ఉండగా బీపీఎల్ ఆరంభానికి ముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మరో షాక్ తగిలింది. ఛటోగ్రామ్ రాయల్స్ జట్టు యాజమాన్యం టోర్నీ ప్రారంభానికి ముందే తప్పుకోవడంతో, ఆ ఫ్రాంచైజీ బాధ్యతలను స్వయంగా బీసీబీ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరిన్ని వార్తలు చదవండి: డ్రీమ్11 వెళ్లినా లాభాలే.. ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐ