Cheteshwar Pujara Brother-in-law Dies by Suicide Amid Pre-Marriage Assault Allegations

రాజ్కోట్లో విషాదం చోటుచేసుకుంది. టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా బావమరిది జీత్ రసిక్భాయ్ పబారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన నిశ్చితార్థం అయిన యువతిపై పెళ్లికి ముందు దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు అతడిని తీవ్రంగా కలవరపరిచినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో కేసు నమోదైన తేదీ (2024 నవంబర్ 26)–అతను ఆత్మహత్యకు ప్రయత్నించిన రోజు ఒకటే కావడం అనుమానాలకు తావిచ్చింది.
ఏం జరిగింది?
గత ఏడాది జీత్కు ఒక యువతితో పెళ్లి సంబంధం కుదిరింది. నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ పెళ్లికి ముందు ఆమెపై జీత్ బలవంతంగా లైంగిక దాడి చేశాడని ఆ యువతి ఫిర్యాదు చేసింది. అనంతరం నిశ్చితార్థం రద్దయింది. తర్వాత జీత్ మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈ వ్యవహారంపై ఆ యువతి పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి కేసు విచారణ కొనసాగుతోంది.
ఈ ఘటనలన్నింటితో జీత్ మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యుల నుంచి సమాచారం. బుధవారం అతడు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా, విషయం తెలుసుకున్న మాలవీయనగర్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు. కానీ వైద్యులు అతడు అప్పటికే మరణించినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు.
పుజారా కుటుంబంలో దుఃఖం
ఛతేశ్వర్ పుజారా భార్య పూజా పబారి కుటుంబం అసలు జంజోధ్పూర్కు చెందినది. తర్వాత వారు రాజ్కోట్కు వచ్చి పత్తి జిన్నింగ్ వ్యాపారం స్థాపించి అక్కడే స్థిరపడ్డారు. పూజా గొండాల్లో జన్మించి, అబులోని సోఫియా స్కూల్లో చదువు ప్రారంభించింది. 11, 12 తరగతులను అహ్మదాబాద్లో పూర్తిచేసి, ముంబైలో మాస్టర్స్ డిగ్రీ సాధించింది. పుజారాతో వివాహానికి ముందు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసింది.
జీత్ మరణంతో పుజారా కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన పుజారా, భారత్–దక్షిణాఫ్రికా రెండో టెస్టులో కామెంటేటర్గా వ్యవహరిస్తున్న సమయంలోనే ఈ దుర్వార్త తెలిసింది. విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
మరిన్ని వార్తలు చదవండి: T20 WC 2026 ముందు శ్రీలంకలో కెప్టెన్సీ మార్పు? అసలంక భవిష్యత్పై పెద్ద చర్చ!