IPL

Cricket Controversies 2025: Asia Cup, Shake Hand Issue, Rafel Sigal & South Africa Coach Comments

by Guna SRV

ఆట అంటేనే యుద్ధం. ఈ యుద్ధంలో విజయం ఒక భాగం అయితే, వివాదం కూడా దాని వెన్న మీద వచ్చే నీడలా ఉంటుంది. 2025లో క్రికెట్ అభిమానులకు మరిచిపోలేని అనేక సంఘటనలు ఘటించాయి. ఉత్కంఠభరిత విజయాలు మాత్రమే కాదు, మైదానంలో ఉద్రిక్తత మరియు వివాదాలు కూడా ఎక్కువగా చర్చనీయమైనవి అయ్యాయి. ఆటలో సరిహద్దుల రాజకీయాలు మిళితమయ్యాయి, క్రికెటర్ల నోటి దురుసు మైదానం దాటి రచ్చ రేపింది.

ఈ ఏడాది ఆసియా కప్ షేక్ హ్యాండ్ వివాదం నుండి సౌతాఫ్రికా హెడ్ కోచ్ వివాదాస్పద వ్యాఖ్యల వరకు, అనేక ఘటనలు క్రికెట్ ప్రపంచాన్ని కదిలించాయి. రఫెల్ సైగల్స్, ట్విట్టర్ రియాక్షన్స్ అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఇప్పుడు ఈ ఏడాది మైదానంలో ఘటించిన ప్రధాన వివాదాస్పద ఘటనలను తెలుసుకుందాం.

1. షేక్ హ్యాండ్ వివాదం

ఆసియా కప్ 2025 టీ20 టోర్నీ సందర్భంగా, భారత క్రికెటర్లు పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం తీవ్ర వివాదాస్పదమైంది. పహల్గాం ఉగ్రదాడులు, ఆపరేషన్ సింధూర్ వంటి పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. దీంతో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడకూడదని డిమాండ్ దేశవ్యాప్తంగా వ్యక్తమైంది. ఐసీసీ రూల్స్ ప్రకారం, భారత్ మ్యాచ్ ఆడింది కానీ జట్టుకు షేక్ హ్యాండ్ ఇవ్వడం నిరాకరించింది.

ఈ ఘటనను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అవమానంగా భావించి, ఐసీసీకి ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకోవాలని UAEలో మ్యాచ్‌కు ముందు బెదిరింపులు ఇచ్చారు. చివరికి మ్యాచ్ రిఫరీ క్షమాపణలు చెప్పడంతో పరిష్కారం కలిగింది. విజయానంతరం సూర్య కుమార్ యాదవ్ భారత సాయుధ బలగాలకు అంకితమివ్వడం కూడా వివాదాస్పదంగా మారింది. ఇది ఐసీసీ రూల్స్‌కు విరుద్ధంగా కావడంతో, అతని మ్యాచ్ ఫీజులో కోతలు విధించారు.

2. రఫెల్ సైగల్ వివాదం

ఆసియా కప్‌లో పాకిస్తాన్ పేసర్ హారీస్ రౌఫ్ మరియు ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ చేసిన సైగల్స్ భారత అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత యుద్ధ విమానాలను కూల్చేసామని హారీస్ రౌఫ్ సైగల్ చేశాడు. అలాగే, ఫర్హాన్ హాఫ్ సెంచరీ తరువాత తుపాకీ ఎక్కిపెట్టినట్లుగా సంబరాలు చేసుకోవడం కూడా సమస్యగా నిలిచింది.

ఈ రెండు ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఐసీసీ, మ్యాచ్ ఫీజులో కోత విధిస్తూ, డీమెరిట్ పాయింట్లు కలిపి కఠిన చర్యలు తీసుకుంది.

3. ట్రోఫీ ఎత్తుకెళ్లిన PCB ఛైర్మన్

ఆసియా కప్ 2025ని భారత్ విజేతగా నిలిచినప్పటికీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ మోహ్‌సిన్ నఖ్వీ ట్రోఫీని ఎత్తుకెళ్లడం వివాదాస్పదంగా నిలిచింది. ఏసీసీ ఛైర్మన్ హోదాలో టైటిల్ ఇవ్వాలని మోహ్‌సిన్ నఖ్వీ సిద్ధమై ఉన్నా, భారత్ నిరాకరించింది. పాకిస్తాన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోలేమని పేర్కొంది. దీంతో, ఆయన ట్రోఫీ ఎత్తుకెళ్లగా, భారత్ ట్రోఫీ లేకుండా సంబరాలు చేసుకుంది. ఇప్పటివరకు ఆ టైటిల్ భారత్‌కు అందలేదు. ఈ ఘటనపై BCCI ఐసీసీకి ఫిర్యాదు చేసింది.

4. సౌతాఫ్రికా హెడ్ కోచ్ వివాదాస్పద వ్యాఖ్యలు

సౌతాఫ్రికా తో ఇటీవల ముగిసిన రెండు టెస్ట్‌ల సిరీస్‌లోనూ వివాదాస్పద సంఘటనలు చోటు చేసుకున్నాయి. సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను భారత ఆటగాళ్లు పంత్, బుమ్రా పొట్టోడా అని సంబోధించడం వివాదాస్పదంగా మారింది. బవుమా దీనిపై పట్టించుకోకపోయినా, బుమ్రా క్షమాపణలు చెప్పాడు.

రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో, సౌతాఫ్రికా హెడ్ కోచ్ కాన్రాడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. త్వరగా డిక్లేర్ చేయకపోవడాన్ని కారణంగా చెప్పిన కాన్రాడ్, భారత ఆటగాళ్లు మమ్మల్ని ప్రాధేయపడేలా చేయాలనుకున్నారు అని తెలిపాడు. ఈ క్రమంలో Grovel అనే పదాన్ని ఉపయోగించడం, జాత్యహంకారానికి ప్రతీకగా ఉండే పదం కావడం వల్ల తీవ్ర విమర్శలకు గురయింది. భారత మాజీ క్రికెటర్లు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విధంగా, 2025లో క్రికెట్ మైదానంలో కేవలం ఆట మాత్రమే కాదు, వివాదాలు కూడా అంతే హైలైట్ అయ్యాయి.

మరిన్ని వార్తలు చదవండి: SMAT 2025: అర్జున్ టెండూల్కర్ మూడు వికెట్లతో ధాటిగా – గోవా ఘన విజయం