Daryl Mitchell Century Threatens Virat Kohli No.1 ODI Ranking

వన్డే క్రికెట్లో నిలకడైన ప్రదర్శనతో ఐసీసీ నెం.1 బ్యాటర్గా ఎదిగిన విరాట్ కోహ్లీ, 37 ఏళ్ల వయసులో మళ్లీ అగ్రస్థానాన్ని అందుకోవడం అభిమానులను ఉత్సాహపరిచింది. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలిచేలా కనిపించడం లేదు. ప్రస్తుతం నెం.2 స్థానంలో ఉన్న న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ వరుసగా రెండో సెంచరీ సాధించి, త్వరలోనే ఐసీసీ నెం.1 వన్డే బ్యాటర్గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
విరాట్ కోహ్లీకి, డారిల్ మిచెల్కు మధ్య కేవలం ఒక్క పాయింట్ మాత్రమే తేడా ఉంది. రెండో వన్డేలో సెంచరీతో విరాట్ను అధిగమించిన మిచెల్, ఇండోర్లో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో కూడా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో విరాట్ సెంచరీ చేసినా కూడా తన నెం.1 ర్యాంక్ను కాపాడుకోవడం కష్టంగా మారే పరిస్థితి ఏర్పడింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు, డారిల్ మిచెల్ మరియు గ్లెన్ ఫిలిప్స్ శతకాలతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 337 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. కేవలం 5 పరుగులకే ఓపెనర్లు డివాన్ కాన్వే మరియు హెన్రీ నికోల్స్ ఔట్ కావడం జట్టుకు తొలుత షాక్ ఇచ్చింది. కాన్వేను హర్షిత్ రాణా అవుట్ చేయగా, నికోల్స్ను అర్ష్దీప్ సింగ్ గోల్డెన్ డక్గా పెవిలియన్కు పంపాడు.
విల్ యంగ్ 41 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 30 పరుగులు చేశాడు. ఆ దశలో డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ కలిసి నాలుగో వికెట్కు 219 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 2022లో టామ్ లాథమ్ మరియు కేన్ విలియంసన్ 221 పరుగుల అజేయ భాగస్వామ్యం చేసిన తర్వాత, భారత్పై న్యూజిలాండ్కు ఇదే అత్యధిక వన్డే భాగస్వామ్యం కావడం విశేషం.
భారత్పై ఒకే వన్డేలో ఇద్దరు న్యూజిలాండ్ బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. గ్లెన్ ఫిలిప్స్ 88 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 106 పరుగులు చేసి అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. డారిల్ మిచెల్ 131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 137 పరుగులు చేసి మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. సెంచరీ అనంతరం మిచెల్ను విరాట్ కోహ్లీ అభినందించడం అభిమానులను ఆకట్టుకుంది.
తర్వాత మిచెల్ హే కేవలం 2 పరుగులకే ఎల్బీడబ్ల్యూ ఔట్ అయ్యాడు. దీంతో మూడు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ కొంత ఒత్తిడిలో పడింది. క్రిస్టియన్ క్లార్క్ 11 పరుగులు చేయగా, మైకేల్ బ్రాస్వెల్ 18 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్సర్లతో 27 పరుగులు చేసి జట్టుకు కీలకమైన మద్దతు అందించాడు.
భారత బౌలర్లలో హర్షిత్ రాణా మరియు అర్ష్దీప్ సింగ్ చెరో మూడు వికెట్లు తీసుకున్నప్పటికీ, ఎక్కువగా పరుగులు ఇవ్వాల్సి వచ్చింది.
మరిన్నివార్తలుచదవండి: అండర్-19 ప్రపంచకప్ 2026: వైభవ్ సూర్యవంశీ రికార్డుల ఇన్నింగ్స్