IPL

Delhi Squad Announced for Vijay Hazare Trophy 2025: Kohli Included, Pant Captain

by Guna SRV

దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ–2025 కోసం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) తమ జట్టును ప్రకటించింది. ఈ టోర్నీలో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడని డీడీసీఏ స్పష్టం చేసింది. అలాగే భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ ఈసారి ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

మరోవైపు, టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా వీలైనప్పుడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడని డీడీసీఏ తెలిపింది. భారత మాజీ స్టార్ బౌలర్ ఇషాంత్ శర్మతో పాటు నవదీప్ సైనీ కూడా ఈసారి ఢిల్లీ జట్టులో చోటు దక్కించుకున్నారు. పంత్‌కు డిప్యూటీగా ఆయుష్ బదోని వ్యవహరించనున్నాడు. తేజస్వి సింగ్ వికెట్ కీపర్‌గా జట్టుకు సేవలు అందించనున్నాడు.

2010 తర్వాత మళ్లీ ఢిల్లీ తరఫున కోహ్లి

విరాట్ కోహ్లి 2010లో చివరిసారిగా తన స్వస్థల జట్టు ఢిల్లీ తరఫున విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొన్నాడు. వన్డే క్రికెట్‌లో 53 సెంచరీలతో రికార్డులు సృష్టించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్, ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ దేశీ క్రికెట్ బరిలోకి దిగనున్నాడు. ప్రతి ఆటగాడు కనీసం రెండు దేశీ మ్యాచ్‌లు అయినా ఆడాలన్న బీసీసీఐ నిబంధనల నేపథ్యంలో కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ముంబై తరఫున ఆరంభ మ్యాచ్‌లకు రోహిత్ శర్మ అందుబాటులో ఉండడంలేదని ఎంసీఏ చీఫ్ సెలక్టర్ సంజయ్ పాటిల్ ఇటీవల వెల్లడించారు.

విజయ్ హజారే ట్రోఫీ–2025కు ఢిల్లీ జట్టు

రిషభ్ పంత్ (కెప్టెన్), ఆయుష్ బదోని (వైస్ కెప్టెన్), అర్పిత్ రాణా, విరాట్ కోహ్లి, హర్షిత్ రాణా, నితీష్ రాణా, యశ్ ధుల్, సార్థక్ రంజన్, నవదీప్ సైనీ, ఇషాంత్ శర్మ, హృతిక్ షోకీన్, తేజస్వి సింగ్ (వికెట్ కీపర్), హర్ష్ త్యాగి, సిమర్‌జీత్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ఆయుష్ దొసేజా, దివిజ్ మెహ్రా, వైభవ్ కంద్పాల్, రోహన్ రాణా, అనూజ్ రావత్.

మరిన్ని వార్తలు చదవండి: దేశవాళీ క్రికెట్‌లో ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ!