IPL

Dilip Vengsarkar Slams Selectors Over Auqib Nabi’s Exclusion From India Test Squad

by IPL Web Desk

Dilip Vengsarkar Slams Selectors Over Auqib Nabi’s Exclusion From India Test Squadభారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ భారత సెలెక్టర్లు, అలాగేభారత క్రికెట్ నియంత్రణ మండలి పై తీవ్ర విమర్శలు చేశారు. జమ్మూ కశ్మీర్ యువ పేసర్ ఔకిబ్ నబీను ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు భారత జట్టులో ఎంపిక చేయకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో కేవలం 10 మ్యాచ్‌ల్లోనే 60 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన కనబరిచినప్పటికీ నబీకి 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కలేదు. దీంతో దేశీయ క్రికెట్ ప్రదర్శనలకు నిజంగా విలువ ఉందా అనే చర్చ మళ్లీ మొదలైంది.

టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన వెంక్‌సర్కార్, దేశీయ సీజన్ మొత్తాన్ని శాసించిన బౌలర్‌ను పక్కన పెట్టడం అర్థంలేని నిర్ణయమని అన్నారు. జమ్మూ కశ్మీర్ తరఫున వరుసగా మ్యాచ్‌లు గెలిపించిన నబీకి “అందరికంటే ముందు” భారత జట్టులో అవకాశం రావాల్సిందని పేర్కొన్నారు. దేశీయ క్రికెట్‌లో అద్భుతంగా ఆడినా జాతీయ జట్టులో చోటు రాకపోతే రంజీ ట్రోఫీ నిర్వహణ ఉద్దేశమేంటని ఆయన ప్రశ్నించారు.

“సెలెక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా ఆశ్చర్యకరం. ఇలాంటి సెలెక్షన్ ఎలా చేస్తారు? ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. నబీకి ఇది అన్యాయం,” అని వెంక్‌సర్కార్ మండిపడ్డారు. దేశీయ క్రికెట్ ఆడితేనే భారత జట్టులో అవకాశాలు ఉంటాయని బీసీసీఐ చెబుతుంటే, నబీ లాంటి ప్రదర్శనలు చేసిన ఆటగాళ్లను ఎందుకు విస్మరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

రంజీలో ఆకిబ్ నబీ అద్భుత ఎదుగుదల

గత రెండు సీజన్‌లుగా భారత దేశీయ క్రికెట్‌లో ఆకిబ్ నబీ ఎదుగుదల ప్రత్యేకంగా నిలిచింది. 2020లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన ఈ పేసర్ ఇప్పటివరకు 41 మ్యాచ్‌ల్లో 156 వికెట్లు సాధించాడు. అందులో గత రెండు సీజన్‌ల్లోనే 104 వికెట్లు రావడం విశేషం. ఈ సీజన్‌లో అతడు సాధించిన 60 వికెట్లు జమ్మూ కశ్మీర్‌కు తొలి రంజీ ట్రోఫీ టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాయి.

రంజీ ట్రోఫీ ఒకే సీజన్‌లో 60 వికెట్ల మైలురాయిని అందుకున్న పేసర్ల జాబితాలో నబీకి ముందు కేవలం దొడ్డ గణేష్, జయదేవ్ ఉనద్కట్ మాత్రమే ఉన్నారు. అంతకుముందు సీజన్‌లో కూడా నబీ ఎనిమిది మ్యాచ్‌ల్లో 44 వికెట్లు తీసి టోర్నమెంట్‌లో రెండో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. వరుసగా రెండు సీజన్‌ల్లో స్థిరమైన ప్రదర్శన ఇవ్వడంతో ఈసారి అతడికి భారత జట్టులో తొలి అవకాశం ఖాయమనే అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే ఏకైక టెస్టుకు భారత జట్టులో శుభమాన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ తదితరులు చోటు దక్కించుకున్నారు. అయితే ఈ సెలెక్షన్‌లో ఆకిబ్ నబీకి అవకాశం ఇవ్వకపోవడమే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.