IPL

ECB to Review Brendon McCullum Future After Ashes Series Loss

by Guna SRV

లండన్: ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ టెస్ట్ సిరీస్‌లో ఓటమి తర్వాత ఇంగ్లండ్ జట్టు చీఫ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ భవిష్యత్తుపై చర్చలు మొదలయ్యాయి. ఆయనను కొనసాగించాలా లేదా అనే అంశంపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకోనుంది.

ఈ విషయంపై చర్చించేందుకు ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్డ్, చైర్మన్ రిచర్డ్ థాంప్సన్ ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆసీస్‌తో జరిగే చివరి యాషెస్ టెస్ట్ సందర్భంగా మెకల్లమ్, ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో వారు చర్చలు జరిపే అవకాశం ఉంది.

2010–11 సిరీస్ తర్వాత యాషెస్‌ను గెలవలేకపోతున్న ఇంగ్లండ్, ఈసారి కేవలం 11 రోజుల్లోనే సిరీస్‌ను చేజార్చుకుంది. ఆస్ట్రేలియా ప్రధాన బౌలర్లు జోష్ హాజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్ లేకపోయినా కూడా ఇంగ్లండ్ బ్యాటింగ్ ఘోరంగా విఫలమైంది. బౌలింగ్ విభాగంలోనూ జట్టు ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయింది.

ఈ నేపథ్యంలో మెకల్లమ్ ప్రవేశపెట్టిన బజ్ బాల్ వ్యూహంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చడంలో మెకల్లమ్ విఫలమవుతున్నాడని ఈసీబీ భావిస్తున్నట్లు సమాచారం. ప్రారంభంలో కేవలం టెస్ట్ జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన మెకల్లమ్ ఒప్పందం ప్రస్తుతం 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కొనసాగుతోంది.

గత ఏడాది వన్డే ఫార్మాట్‌లో ఇంగ్లండ్ రికార్డు నాలుగు విజయాలు, పదకొండు ఓటములుగా ఉండగా, తాజా యాషెస్ పరాజయం నేపథ్యంలో అన్ని ఫార్మాట్లలో కోచ్‌గా మెకల్లమ్‌ను కొనసాగించాలా లేదా అనే అంశంపై ఈసీబీ తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌కు సమయం తక్కువగా ఉండటంతో, ప్రస్తుత పరిస్థితుల్లో కోచ్ మార్పు జరిగే అవకాశం లేదని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.

మరిన్నివార్తలుచదవండిశుభ్‌మన్ గిల్ తిరిగి ఫాంలోకి వస్తాడా? విజయ్ హజారే ట్రోఫీలో అవకాశాలు