IPL

Fact Check: Rohit Sharma Back as ODI Captain? Truth Behind Viral Post

by Guna SRV

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి వన్డే జట్టుకు నాయకత్వం వహించబోతున్నాడా? ప్రస్తుతం వన్డే కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్ స్థానానికి ప్రమాదమా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో జోరుగా చర్చకు వస్తున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ పోస్ట్ ఈ అంశంపై పెద్ద గందరగోళాన్ని సృష్టించింది.

ఈ ఏడాది ప్రారంభంలోనే రోహిత్ శర్మ కెప్టెన్సీ ప్రయాణానికి ముగింపు పలికిన బీసీసీఐ.. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని శుభ్‌మన్ గిల్‌ను భారత వన్డే జట్టు కొత్త సారథిగా నియమించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనతో గిల్ వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. వన్డే ప్రపంచకప్ 2027 లక్ష్యంగా తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని అప్పట్లో సెలెక్టర్లు స్పష్టంగా తెలిపారు. అలాగే ఆ టోర్నీ వరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులో కొనసాగుతారా? అనే సందేహాలు కూడా అప్పట్లో వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలోనే భవిష్యత్‌కు సిద్ధమైన నాయకుడిని తయారు చేయాలనే ఉద్దేశంతో గిల్‌కు కెప్టెన్సీ అప్పగించినట్లు సెలక్షన్ కమిటీ వివరించింది. అయితే ఇటీవల శుభ్‌మన్ గిల్ ఫామ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం, అలాగే ఫిట్‌నెస్ సమస్యలు ఎదురుకావడం కారణంగా అతడిని టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో ఎంపిక చేయలేదు. ఇది పూర్తిగా టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే తీసుకున్న నిర్ణయమని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. ఆ పోస్ట్‌లో రోహిత్ శర్మను తిరిగి భారత వన్డే కెప్టెన్‌గా నియమించేందుకు బీసీసీఐ సిద్ధమైందని, ఇప్పటికే ఈ విషయమై అతనితో చర్చలు కూడా జరిగాయని పేర్కొన్నారు. అంతేకాదు, వన్డే ప్రపంచకప్ 2027లో టీమిండియాను రోహిత్ శర్మే నడిపించబోతున్నాడని కూడా ఆ పోస్ట్‌లో పేర్కొనడంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది.
“కెప్టెన్ రోహిత్ శర్మ ఈజ్ బ్యాక్. ప్రపంచకప్ దృష్ట్యా మళ్లీ వన్డే సారథ్య బాధ్యతలు చేపట్టాలని సెలెక్టర్లు కోరుతున్నారు” అంటూ చేసిన వ్యాఖ్యలు వేగంగా వైరల్ అయ్యాయి.

ఈ పోస్ట్‌కు లక్షకు పైగా వ్యూస్ రావడంతో చాలామంది అభిమానులు ఇది నిజమేనని నమ్మి షేర్ చేస్తున్నారు. అయితే వాస్తవానికి ఇది పూర్తిగా ఫేక్ న్యూస్. రోహిత్ శర్మకు తిరిగి వన్డే కెప్టెన్సీ అప్పగించాలన్న విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నమ్మదగిన వర్గాల నుంచి కూడా ఈ అంశంపై ఎలాంటి ధృవీకరణ రాలేదు.

ప్రస్తుతానికి భారత వన్డే జట్టు సారథిగా శుభ్‌మన్ గిల్‌నే కొనసాగనున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రం సీనియర్ ఆటగాళ్లుగా జట్టులో కీలక పాత్ర పోషిస్తారు. ఇప్పటికే టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరూ వన్డే ఫార్మాట్‌పై పూర్తిగా దృష్టి పెట్టారు. వన్డే ప్రపంచకప్ 2027ే వారి ప్రధాన లక్ష్యం.

ప్రస్తుతం రోహిత్, కోహ్లీ ఇద్దరూ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. విజయ్ హజారే ట్రోఫీలో ఇద్దరూ శతకాలతో చెలరేగి సెలెక్టర్లకు గట్టి సందేశం పంపించారు. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో వీరిద్దరూ మరోసారి టీమిండియా జెర్సీలో అభిమానులను అలరించనున్నారు.

మరిన్ని వార్తలు చదవండి: టీ20 వరల్డ్ కప్ 2026 ఫోకస్.. కివీస్ సిరీస్‌కు టీమిండియా స్టార్లు అవుట్!