IPL

From Ishan Kishan to Sakib Hussain: Why Bihar Could Get an IPL Team

by IPL Web Desk

From Ishan Kishan to Sakib Hussain: Why Bihar Could Get an IPL Teamభారత ప్రముఖ పారిశ్రామికవేత్త, వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్  బిహార్‌కు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఒక జట్టు ఉండాలని అభిప్రాయపడ్డారు. భారత క్రికెట్‌లో అతిపెద్ద టోర్నమెంట్‌గా కొనసాగుతున్న ఐపీఎల్‌లో బిహార్‌కు ప్రాతినిధ్యం దక్కాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. 1954లో పాట్నాలో జన్మించిన అగర్వాల్, సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో చేసిన పోస్టులో బిహార్ ఎన్నో ప్రతిభావంతులైన క్రికెటర్లను అందించినా, సంవత్సరాలుగా సరైన క్రికెట్ మౌలిక సదుపాయాలు లేక వెనుకబడిందని చెప్పారు.

2022లోగుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్  జట్ల ప్రవేశంతో ఐపీఎల్ విస్తరించిన విషయం తెలిసిందే. దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లో ఒకటైన బిహార్‌కు కూడా ప్రత్యేక ఐపీఎల్ ఫ్రాంచైజీ ఉండేందుకు కావాల్సిన ప్రతిభ, అభిమాన మద్దతు రెండూ ఉన్నాయని అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా బిహార్‌కు చెందినఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ, సాకిబ్ హుస్సేన్ వంటి ఆటగాళ్ల విజయాలను ప్రస్తావించారు.

తన పోస్టులో అగర్వాల్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్  వంటి ప్రముఖ ఐపీఎల్ జట్లను ఉదాహరణగా పేర్కొన్నారు. ఇషాన్ కిషన్ వేగవంతమైన వన్డే డబుల్ సెంచరీలలో ఒకటి నమోదు చేసిన విషయాన్ని గుర్తుచేసిన ఆయన, వైభవ్ సూర్యవంశీ అతి చిన్న వయసులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసి సంచలనం సృష్టించాడని కొనియాడారు. అలాగే గోపాల్గంజ్‌కు చెందిన సాకిబ్ హుస్సైన్ సాధారణ కుటుంబం నుంచి ఎదిగి క్రికెట్‌లో గుర్తింపు పొందిన విధానాన్ని ప్రశంసించారు.

బిహార్ క్రికెట్‌కు తగిన గుర్తింపు దక్కలేదన్న అగర్వాల్ ఆవేదన

భారత క్రికెట్‌కు ప్రతిభావంతులైన ఆటగాళ్లను అందించినప్పటికీ బిహార్‌కు తగిన గుర్తింపు దక్కలేదని అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు. చాలా సంవత్సరాల పాటు పరిపాలనా, నిర్మాణాత్మక సమస్యల కారణంగా బిహార్ క్రికెట్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని తెలిపారు. పూర్తి స్థాయి క్రికెట్ బోర్డు వ్యవస్థ లేకపోవడంతో యువ ఆటగాళ్లు అవకాశాలు కోల్పోయారని చెప్పారు. అయితే ఇటీవల పరిస్థితులు క్రమంగా మెరుగుపడటంతో బిహార్ నుంచి యువ క్రికెటర్లు జాతీయ స్థాయిలో మెరుస్తున్నారని పేర్కొన్నారు.

బిహార్ యువతకు ప్రతి రంగంలో అవకాశాలు కల్పించడం తన కల అని అగర్వాల్ తెలిపారు. ముఖ్యంగా క్రికెట్ రంగంలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, అత్యాధునిక శిక్షణ సదుపాయాలు రాష్ట్రంలోనే అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. తమ కలలను నెరవేర్చుకోవడానికి యువ క్రికెటర్లు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు.

బిహార్ యువతతో తాను ఎప్పుడూ ఉంటానని, రాష్ట్ర క్రికెట్ అభివృద్ధికి ఎలాంటి షరతులు లేకుండా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని అగర్వాల్ వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలతో భవిష్యత్తులో బిహార్‌కు ఐపీఎల్ జట్టు రావచ్చా అనే చర్చ మళ్లీ అభిమానుల్లో వేడెక్కింది. రాష్ట్రంలో క్రికెట్‌పై పెరుగుతున్న ఆసక్తి దృష్ట్యా ఈ డిమాండ్ మరింత బలపడుతోంది.