IPL

Hardik Pandya, Jasprit Bumrah Likely to Miss NZ ODIs – BCCI’s Key Call

by Krishna R

న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ముందు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌లో భారత స్టార్ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. టీ20 వరల్డ్ కప్‌–2026ను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వన్డే సిరీస్‌కు దూరంగా ఉండనున్న హార్దిక్, బుమ్రా మాత్రం జనవరి 21 నుంచి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆడనున్నారు. ఈ టీ20 సిరీస్‌ను వరల్డ్ కప్ సన్నాహకాలలో భాగంగా నిర్వహిస్తున్నారు.

మొత్తం ఐదు మ్యాచ్‌ల్లోనూ ఈ ఇద్దరూ బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా వర్క్‌లోడ్ కారణంగా వీరిద్దరికీ విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అదే పర్యటనలో జరిగిన టీ20 సిరీస్‌లో మాత్రం హార్దిక్, బుమ్రా ఆడారు. ఇప్పుడు కూడా అదే తరహా ప్రణాళికను బీసీసీఐ అమలు చేయనుంది.

హార్దిక్ పాండ్యా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత ఇప్పటివరకు ఒక్క వన్డే కూడా ఆడలేదు. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ అనంతరం వన్డే ఫార్మాట్‌కు దూరంగా కొనసాగుతున్నాడు.

బుమ్రా టెస్టుల్లో తన ఘాటు బౌలింగ్‌తో ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతుండగా, హార్దిక్ మాత్రం టీ20ల్లో ఆల్‌రౌండర్‌గా అదరగొడుతున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో హార్దిక్ బ్యాట్, బాల్ రెండింటితోనూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.

ఒకవేళ కివీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరమైతే, ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి జట్టులో అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. అలాగే కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా ఈ సిరీస్‌కు తిరిగి జట్టులోకి రానున్నట్లు సమాచారం.

న్యూజిలాండ్‌తో వన్డేలకు భారత జట్టు (అంచనా):
శుభ్‌మన్ గిల్ (C), శ్రేయాస్ అయ్యర్ (VC), విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (WK), రిషబ్ పంత్(WK), రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్.

మరిన్ని వార్తలు చదవండి: అభిషేక్ శర్మ సిక్సర్ల సునామీ: 45 సిక్సర్లతో భయోత్పాతం