ICC Announces All-Women Match Officials Panel for Women’s T20 World Cup 2026
అంతర్జాతీయ క్రికెట్ మండలి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్కు సంబంధించిన మ్యాచ్ అధికారుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. ఇంగ్లాండ్, వేల్స్ వేదికలుగా జూన్ 12 నుంచి జూలై 5 వరకు ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. మొత్తం 12 జట్లు రెండు గ్రూపులుగా విభజించబడగా, ప్రపంచ స్థాయి అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు పోటీల నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్నారు.
గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. గ్రూప్-బీలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్లు చోటు దక్కించుకున్నాయి. టోర్నమెంట్లో అత్యంత ఆసక్తికర పోరుగా భావిస్తున్న భారత్–పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 14న ఎడ్జ్బాస్టన్లో జరగనుంది. ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు జూన్ 12న శ్రీలంకతో ప్రారంభ మ్యాచ్లో తలపడనుంది.
మహిళల క్రికెట్కు ప్రాధాన్యం పెంచే దిశగా ఐసీసీ మరో కీలక అడుగు వేసింది. వరుసగా మూడో మహిళల టీ20 ప్రపంచకప్కూ పూర్తిగా మహిళా మ్యాచ్ అధికారుల ప్యానెల్ను ప్రకటించింది. మొత్తం 18 మంది అధికారులతో కూడిన ఈ జాబితాలో అనుభవజ్ఞులతో పాటు తొలిసారి ప్రపంచకప్లో బాధ్యతలు నిర్వర్తించనున్న నలుగురు కొత్త అధికారులు కూడా చోటు దక్కించుకున్నారు. 2024 మహిళల టీ20 ప్రపంచకప్లో పనిచేసిన తొమ్మిది మంది అధికారులు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.
అనుభవజ్ఞులైన అంపైర్లతో ఐసీసీ బలమైన ప్యానెల్
భారత్కు ఈ జాబితాలో గట్టి ప్రాతినిధ్యం లభించింది. అనుభవజ్ఞురాలైన మ్యాచ్ రిఫరీ జీఎస్ లక్ష్మీ భారత బృందానికి నాయకత్వం వహించనుండగా, వృందా రాఠీ, జనని ఎన్, గాయత్రి వేణుగోపాలన్ అంపైర్లుగా ఎంపికయ్యారు. ఈ ఏడాది మహిళల టీ20 ప్రపంచకప్లో తొలిసారి బాధ్యతలు చేపట్టనున్న అధికారుల్లో గాయత్రి కూడా ఒకరు కావడం విశేషం.
ఇతర కొత్త అధికారుల్లో షతీరా జాకిర్ జెసీ, కెరిన్ క్లాస్టే, కాండేస్ లా బోర్డే ఉన్నారు. ఇక మహిళల క్రికెట్లో అత్యంత అనుభవం కలిగిన అధికారులుగా గుర్తింపు పొందిన క్లేర్ పొలోసాక్ ఆరో ప్రపంచకప్లో విధులు నిర్వహించనుండగా, జాక్వలైన్ విలియమ్స్, కిమ్ కాటన్ ఐదోసారి ఈ టోర్నమెంట్లో అంపైర్లుగా కనిపించనున్నారు.
అంపైర్ల జాబితాలో లారెన్ అజెన్బాగ్, కిమ్ కాటన్, అన్నా హారిస్, షతీరా జాకిర్ జెసీ, కెరిన్ క్లాస్టే, కాండేస్ లా బోర్డే, జనని ఎన్, నిమాలి పెరెరా, క్లేర్ పొలోసాక్, వృందా రాఠీ, సుజాన్ రెడ్ఫెర్న్, ఎలోయిస్ షెరిడన్, జాక్వలైన్ విలియమ్స్, గాయత్రి వేణుగోపాలన్ ఉన్నారు. మ్యాచ్ రిఫరీల జాబితాలో ట్రూడీ ఆండర్సన్, షాండ్రే ఫ్రిట్జ్, జీఎస్ లక్ష్మీ, మిచెల్ పెరెరా చోటు దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా ఐసీసీ ప్రధాన కార్యనిర్వాహక అధికారి సంజోగ్ గుప్తా స్పందిస్తూ మహిళల క్రికెట్లో సమాన ప్రాతినిధ్యాన్ని మరింత విస్తరించడమే తమ లక్ష్యమని తెలిపారు. క్రీడలోని ప్రతి విభాగంలో అవకాశాలు పెంచే దిశగా ఈ ఎంపికలు కీలకమని పేర్కొన్నారు. అధికారుల పనితీరు, నిర్ణయ సామర్థ్యాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఎంపికలు చేసినట్లు వెల్లడించారు.
ఐపీఎల్ 2026 ‘హనీ ట్రాప్’ వివాదంపై అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు