ICC Rates Lord's and Gaddafi Stadium Pitches Unsatisfactory, Hands Demerit Points
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య లార్డ్స్లో జరిగిన తొలి టెస్టుకు ఉపయోగించిన పిచ్తో పాటు, లాహోర్లోని గద్దాఫీ స్టేడియంలో పాకిస్థాన్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డేకు ఉపయోగించిన పిచ్కు "అసంతృప్తికరమైనది" అనే రేటింగ్ ఇచ్చింది. దీంతో ఈ రెండు వేదికలకు ఐసీసీ పిచ్ మరియు అవుట్ఫీల్డ్ పర్యవేక్షణ విధానం ప్రకారం ఒక్కో డీమెరిట్ పాయింట్ విధించింది.
లార్డ్స్ టెస్టుకు మ్యాచ్ రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్, లాహోర్ వన్డేకు మ్యాచ్ రిఫరీగా ఉన్న గ్రేమ్ లా బ్రూయ్ సమర్పించిన నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ నివేదికల్లో ఇద్దరు రిఫరీలు కూడా పిచ్ ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేశారు.
లార్డ్స్ పిచ్పై తన నివేదికలో పైక్రాఫ్ట్ మాట్లాడుతూ టెస్టు మొత్తం బంతికి అధిక సీమ్ మూవ్మెంట్ లభించిందని పేర్కొన్నారు. అంతేకాకుండా బంతి అనేక సందర్భాల్లో అనూహ్యంగా తక్కువ ఎత్తులో బౌన్స్ కావడం వల్ల బ్యాటర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు.
శతకం కాకపోయినా ప్రత్యేకమే.. ఆఫ్ఘానిస్తాన్పై పంత్ 81 పరుగుల ఇన్నింగ్స్ ఎందుకు కీలకం?
ఈ టెస్టులో ఆరంభం నుంచే బౌలర్లకు భారీ సహకారం లభించింది. తొలి రోజే 16 వికెట్లు పడగా, రెండో రోజు మరో 17 వికెట్లు కూలాయి. దీంతో బ్యాటింగ్-బౌలింగ్ మధ్య సమతుల్యత పూర్తిగా దెబ్బతిన్నట్లు కనిపించింది.
పిచ్ బౌలర్లకే ఎక్కువగా అనుకూలించిందని, బ్యాటర్లు మరియు బౌలర్ల మధ్య సమాన పోటీని అందించడంలో విఫలమైందని పైక్రాఫ్ట్ తన నివేదికలో పేర్కొన్నారు. అసమాన బౌన్స్, అధిక మూవ్మెంట్ కారణంగా న్యాయమైన పోటీ జరగలేదని అభిప్రాయపడ్డారు.
లార్డ్స్, గద్దాఫీ స్టేడియాలపై ఐసీసీ చర్య
ఇక గద్దాఫీ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో ఉపయోగించిన పిచ్పైనా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ పిచ్ చాలా నెమ్మదిగా ఉండటంతో పాటు తక్కువ ఎత్తులో బౌన్స్ కావడం వల్ల షాట్లు ఆడటం బ్యాటర్లకు చాలా కష్టంగా మారిందని గ్రేమ్ లా బ్రూయ్ తెలిపారు.
బ్యాటర్లు దూకుడుగా ఆడే ముందు క్రీజులో ఎక్కువ సమయం గడపాల్సి వచ్చిందని, వన్డే క్రికెట్కు ఇది అనుకూల పరిస్థితి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే మ్యాచ్ ప్రారంభ దశలోనే స్పిన్నర్లకు సహకారం లభించడం మొదలై, మ్యాచ్ మొత్తం అదే పరిస్థితి కొనసాగిందని పేర్కొన్నారు.
ఈ నివేదికల అనంతరం ఐసీసీ అధికారికంగా ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లకు సమాచారం అందించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేయాలనుకుంటే ఆయా బోర్డులకు 14 రోజుల గడువు ఇచ్చింది.
ఐసీసీ నిబంధనల ప్రకారం డీమెరిట్ పాయింట్లు ఐదేళ్ల కాలం పాటు అమల్లో ఉంటాయి. ఒక వేదిక ఐదేళ్ల వ్యవధిలో ఆరు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు సంపాదిస్తే, అక్కడ అంతర్జాతీయ క్రికెట్ నిర్వహణపై 12 నెలల నిషేధం విధించబడుతుంది.
సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్ ప్రకటించాడా? వైరల్ వార్తల వెనుక అసలు నిజం ఇదే
అదే ఒక వేదిక 12 డీమెరిట్ పాయింట్లకు చేరుకుంటే, 24 నెలల పాటు అంతర్జాతీయ మ్యాచ్ల నిర్వహణ హక్కు కోల్పోతుంది. అయితే లార్డ్స్, గద్దాఫీ స్టేడియాలకు ఇంతకుముందు ఎలాంటి డీమెరిట్ పాయింట్లు లేవు. ప్రస్తుతం ఈ రెండు వేదికల ఖాతాలో ఒక్కో డీమెరిట్ పాయింట్ మాత్రమే ఉంది.