IPL

IND vs PAK U19 Asia Cup Final Turns Heated Vaibhav Suryavanshi vs Ali Raza Controversy

by Guna SRV

భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఇవాళ (డిసెంబర్‌ 21) జరిగిన అండర్‌-19 పురుషుల ఆసియా కప్ ఫైనల్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 348 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటర్లను పాకిస్థాన్‌ బౌలర్‌ అలీ రజా రెచ్చగొట్టాడు. తొలుత భారత కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రేను టార్గెట్‌ చేసిన రజా, ఆ తర్వాత చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీతో కూడా అనుచితంగా ప్రవర్తించాడు. ఇద్దరూ తగిన రీతిలో ప్రతిస్పందించడంతో మైదానంలో వాతావరణం వేడెక్కింది.

ఏమన్నావురా..?

భారీ లక్ష్య ఛేదనలో భారత కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఈ సమయంలో అలీ రజా అద్భుతమైన బంతితో మాత్రేను ఔట్‌ చేశాడు. వికెట్‌ తీసిన ఆనందంలో రజా హద్దు మీరి వ్యవహరించాడు. “ఇక చాలు.. వెళ్లిపో” అన్నట్లు హావభావాలు ప్రదర్శించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన మాత్రే “ఏమన్నావురా?” అన్నట్లుగా రజా వైపు దూసుకెళ్లాడు. దీంతో కొద్దిసేపు మైదానంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

నీ స్థాయి నా కాళ్ల కింద..!

మాత్రేతో ఘర్షణకు దిగిన రజా, ఆ తర్వాత వైభవ్‌ సూర్యవంశీతో కూడా అదే తరహాలో ప్రవర్తించాడు. ఇన్నింగ్స్‌ను సిక్సర్‌తో ప్రారంభించిన సూర్యవంశీ (10 బంతుల్లో 26 పరుగులు; 1 ఫోర్‌, 3 సిక్సర్లు)ను ఔట్‌ చేసిన తర్వాత రజా ఓవరాక్షన్‌ చేశాడు. ఫియరీ సెండాఫ్‌ ఇచ్చే ప్రయత్నం చేయడంతో సూర్యవంశీ కూడా తగిన రీతిలో బదులిచ్చాడు. “నీ స్థాయి నా కాళ్ల కింద” అన్న భావాన్ని వ్యక్తం చేస్తూ రజాకు బుద్ధి చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

టీమిండియాకు పరాభవం

348 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా పూర్తిగా తడబడింది. ఆది నుంచే వరుసగా వికెట్లు కోల్పోతూ ఓటమిని కొని తెచ్చుకుంది. కేవలం 26.2 ఓవర్లలో 156 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఫలితంగా భారత్‌ 191 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది.

పాక్‌ బౌలర్లలో అలీ రజా 4 వికెట్లు తీసి భారత పతనానికి ప్రధాన కారణమయ్యాడు. మొహమ్మద్‌ సయ్యమ్‌, అబ్దుల్‌ సుభాన్‌, సుజైఫా ఎహసాన్‌ తలో రెండు వికెట్లు తీసి టీమిండియాను కుదిపేశారు.

భారత బ్యాటింగ్‌ వైఫల్యం

భారత్‌ తరఫున చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ ఇన్నింగ్స్‌ను సిక్సర్‌తో ప్రారంభించినా కొద్ది సేపటికే ఔటయ్యాడు. అంతకుముందే కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే (2), స్టార్‌ ప్లేయర్‌ ఆరోన్‌ జార్జ్‌ (16) పెవిలియన్‌కు చేరారు. కేవలం 86 పరుగులకే 6 వికెట్లు కోల్పోవడంతో ఆదిలోనే భారత ఓటమి ఖరారైంది.

ఆఖర్లో దీపేశ్‌ దేవేంద్రన్‌ (36) కొంత పోరాటం చేసినా అది ఓటమిని ఆపలేకపోయింది. భారత ఇన్నింగ్స్‌లో అతడే టాప్‌ స్కోరర్‌. మిగతా బ్యాటర్లలో విహాన్‌ మల్హోత్రా 7, వేదాంత్‌ త్రివేది 9, అభిగ్యాన్‌ కుందు 13, కనిష్క్‌ చౌహాన్‌ 9, ఖిలన్‌ పటేల్‌ 19, హెనిల్‌ పటేల్‌ 6 పరుగులు చేసి ఔటయ్యారు.

పాక్‌ భారీ స్కోరు

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌, ఓపెనర్‌ సమీర్‌ మిన్హాస్‌ (113 బంతుల్లో 172 పరుగులు; 17 ఫోర్లు, 9 సిక్సర్లు) అద్భుత శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. అహ్మద్‌ హుసేన్‌ (56), ఉస్మాన్‌ ఖాన్‌ (35) కూడా కీలక పాత్ర పోషించారు.

ఓ దశలో పాక్‌ 400 పరుగుల మార్కును దాటుతుందనిపించినా, భారత బౌలర్లు చివర్లో పుంజుకోవడంతో పాక్‌ త్వరితగతిన 5 వికెట్లు కోల్పోయింది. దీంతో స్కోరు వేగం తగ్గింది.

భారత బౌలర్లలో దీపేశ్‌ దేవేంద్రన్‌ 3 వికెట్లు పడగొట్టగా, హెనిల్‌ పటేల్‌, ఖిలన్‌ పటేల్‌ తలో రెండు వికెట్లు, కనిష్క్‌ చౌహాన్‌ ఒక వికెట్‌ తీశారు.

మరోసారి రన్నరప్‌తో సరిపెట్టుకున్న భారత్‌

ఈ టోర్నీ సెమీఫైనల్లో భారత్‌ శ్రీలంకను, పాకిస్థాన్‌ బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరాయి. గత ఎడిషన్‌లో కూడా ఫైనల్లోనే ఓడిన భారత్‌, ఈసారి కూడా రన్నరప్‌కే పరిమితమైంది.

మరిన్ని వార్తలు చదవండి: కష్టానికి ఫలితం దక్కింది ఇషాన్ టీ20 వరల్డ్ కప్ ఎంపికపై తల్లి మాటలు