IND vs SA: Jitesh Sharma Touches Women Cricketer Harleen Deol’s Feet, Netizens Impressed

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా పూర్తిగా ఓటమిని చవిచూసింది. గురువారం డిసెంబర్ 11న చండీగఢ్లోని ముల్లన్పూర్లో జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టు ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయింది. మొదట బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.
అనంతరం బ్యాటర్లు కూడా ఆదుకోలేకపోయారు. చివరికి భారత జట్టు 51 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో తిలక్ వర్మ బ్యాటింగ్లో, వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో మెరిసిన దానిని తప్పుకొని చూస్తే టీమిండియా ప్రదర్శన ఏ మాత్రం ఆకట్టుకోలేదు.
అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ చేసిన ఒక చర్య మాత్రం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. మ్యాచ్ ముగిసిన వెంటనే భారత మహిళా క్రికెటర్ హర్లీన్ డియోల్ను చూసిన జితేష్ ఆమె వద్దకు వెళ్లి అశీస్సులు తీసుకుంటూ పాదాలను నమస్కరించాడు.
తన చేతిలో ఉన్న గ్లోవ్స్ నేలపై వదిలేసి ఆమె కాళ్లు తాకగా, డియోల్ అతడిని వెంటనే లేపి భుజం తట్టింది. తర్వాత ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. జితేష్ చేసిన ఈ వినయపూర్వక వ్యవహారానికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మహిళా క్రికెటర్లపట్ల గౌరవాన్ని చూపించినందుకు అతడిని ఘనంగా మెచ్చుకుంటున్నారు.
Jitesh Sharma touched the feet of Harleen Deol 🙏 pic.twitter.com/89NXxFHqL1
— VIKAS (@Vikas662005) December 12, 2025
హర్లీన్ డియోల్ సొంత రాష్ట్రం పంజాబ్ కావడం, జితేష్తో స్నేహం ఉండటం నేపథ్యంలో ఈ సన్నివేశం మరింత హైలైట్ అయింది. ఇటీవలే మహిళల వరల్డ్ కప్ గెలుపులో డియోల్ కీలక సభ్యురాలిగా నిలిచింది. ఐదు ఇన్నింగ్స్లలో ఆమె 188 పరుగులు చేసింది. అయితే నాకౌట్స్లో ఆమెకు అవకాశం దక్కకపోవడం విచారకరం.
జితేష్ శర్మ విషయానికి వస్తే, ప్రస్తుతం టీమిండియాలో వికెట్ కీపర్ పాత్రను నిర్వహిస్తున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండు టీ20ల్లో కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. మొదటి మ్యాచ్లో 10 పరుగులతో నాటౌట్గా నిలిచిన జితేష్, రెండో మ్యాచ్లో 17 బంతుల్లో 27 పరుగులు చేశాడు.
మ్యాచ్ పరిస్థితులు చూస్తే, సౌతాఫ్రికా ప్రారంభం నుంచే ఆధిపత్యం చూపించింది. మొదట బ్యాటింగ్ చేసిన వారు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసారు. డికాక్ 90 పరుగులతో భారత బౌలర్లను మట్టికరిపించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత బ్యాటింగ్ వరుసగా కూలిపోయింది.
చివరికి టీమిండియా 19.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటై, 51 పరుగుల తేడాతో ఘోర ఓటమి చెందింది. బౌలింగ్లోనూ బ్యాటింగ్లోనూ సఫారీలు సమిష్టిగా రాణించడం వాళ్ల విజయం మరింత ప్రభావవంతంగా మారింది.
మరిన్ని వార్తలు చదవండి: రవీంద్ర జడేజా పై రివాబా సంచలన వ్యాఖ్యలు: టీమిండియా ఆటగాళ్లపై విమర్శలు వైరల్