India A Squad Announced for T20 World Cup 2026 Warm-up Matches

టీ20 ప్రపంచకప్కు ముందు జరిగే వార్మప్ మ్యాచ్ల కోసం భారత-ఏ జట్టును శనివారం (ఫిబ్రవరి 2) అధికారికంగా ప్రకటించారు. ఈ జట్టు భాగంగా ఫిబ్రవరి 2న నవీ ముంబైలో యూఎస్ఏతో, ఫిబ్రవరి 6న బెంగళూరులో నమీబియాతో వార్మప్ మ్యాచ్లు ఆడనుంది. ఈ రెండు మ్యాచ్ల కోసం మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు.
ఈ భారత-ఏ జట్టులో టీమిండియా స్టార్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఇటీవల కడుపు సమస్య కారణంగా న్యూజిలాండ్తో జరిగిన సిరీస్కు దూరమైన తిలక్, ఇప్పుడు మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. అతడి రీఎంట్రీపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ వార్మప్ మ్యాచ్ల ద్వారానే తిలక్ తన ఫామ్ను తిరిగి అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.
ఈ జట్టుకు కెప్టెన్గా ఢిల్లీకి చెందిన యువ ఆటగాడు అయుష్ బదోనిని ఎంపిక చేశారు. అతనితో పాటు ఐపీఎల్లో మంచి గుర్తింపు పొందిన ప్రియాంశ్ ఆర్య, అశుతోష్ శర్మలకు కూడా చోటు దక్కింది. టీమిండియా తరపున ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ అనుభవం ఉన్న రవి బిష్ణోయి, రియాన్ పరాగ్ కూడా ఈ జట్టులో భాగమయ్యారు. అంతేకాదు, మయాంక్ యాదవ్, నమన్ ధీర్, ఎన్ జగదీశన్, ఉర్విల్ పటేల్ వంటి ప్రతిభావంతమైన దేశీయ ఆటగాళ్లు కూడా భారత-ఏ జట్టులో ఎంపికయ్యారు.
టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ల కోసం భారత-ఏ జట్టు:
అయుష్ బదోని (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, అశుతోష్ శర్మ, ప్రియాంశ్ ఆర్య, ఎన్ జగదీశన్ (వికెట్కీపర్), రియాన్ పరాగ్, మనవ్ సుతార్, అశోక్ శర్మ, ఉర్విల్ పటేల్ (వికెట్కీపర్), గుర్జప్నీత్ సింగ్, విప్రాజ్ నిగమ్, రవి బిష్ణోయి, ఖలీల్ అహ్మద్, మయాంక్ యాదవ్.
ఇదిలా ఉండగా, వార్మప్ మ్యాచ్లలో భాగంగా టీమిండియా కూడా ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 4న భారత జట్టు సౌతాఫ్రికాతో తలపడుతుంది. ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ రెగ్యులర్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. టోర్నీ ఓపెనర్గా అదే రోజు కొలంబో వేదికగా పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి. అదే రోజున టీమిండియా కూడా తన తొలి మ్యాచ్ను ఆడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ యూఎస్ఏతో పోటీ పడనుంది.
మరిన్ని వార్తలు చదవండి: టీ20 ప్రపంచకప్ 2026: భారత్ మ్యాచ్ బహిష్కరణపై పాకిస్తాన్పై ICC చర్యలు?