IPL

India ODI Squad Announced for New Zealand Series, Shubman Gill to Lead

by Krishna R

న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు భారత క్రికెట్ జట్టును బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం, జనవరి 3న 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది.

ఈ సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. శ్రేయాస్ అయ్యర్ ఎంపిక ఆయన ఫిట్‌నెస్ క్లియరెన్స్‌కు లోబడి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. అలాగే, పని భారం కారణంగా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఈ సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చినట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది.

ఈ వన్డే సిరీస్‌లో భారత జట్టుకు శుభ్‌మాన్ గిల్ నాయకత్వం వహించనున్నాడు. గత నెల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌కు గిల్ దూరంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం పూర్తిగా కోలుకుని కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతని నాయకత్వంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఇటీవల అద్భుత ఫామ్‌లో ఉన్న ఈ ఇద్దరి బ్యాటింగ్‌ను ప్రత్యక్షంగా చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గాయంతో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. గత ఏడాది ఆస్ట్రేలియా సిరీస్‌లో గాయపడిన అయ్యర్ ప్రస్తుతం సుమారు 90 శాతం ఫిట్‌నెస్ సాధించాడు. సిరీస్ ప్రారంభానికి పూర్తిగా కోలుకుంటాడనే నమ్మకంతో జట్టు యాజమాన్యం ఉంది.

దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో శతకం సాధించిన రుతురాజ్ గైక్వాడ్‌కు ఈసారి 15 మంది జట్టులో చోటు దక్కలేదు. శ్రేయాస్ అయ్యర్ తిరిగి జట్టులోకి రావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మరోవైపు, డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నప్పటికీ సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి మరోసారి నిరాశే ఎదురైంది.

హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వన్డే జట్టులో చోటు సంపాదించాడు. బ్యాకప్ వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌కు అవకాశం ఇచ్చారు. యువ ఆటగాళ్లు నితీశ్ కుమార్ రెడ్డి, యశస్వి జైస్వాల్ కూడా జట్టులో భాగమయ్యారు.

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు

శుభ్‌మాన్ గిల్ కెప్టెన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్