India vs New Zealand 5th T20: Ishan Kishan Century Seals Dominant Series Win

తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఐదో టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శనతో ఘన విజయం సాధించింది. 272 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ జట్టు 19.4 ఓవర్లలో 225 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 46 పరుగుల తేడాతో విజయం సాధించి, ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-1తో తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో ఫిబ్రవరిలో జరగనున్న టీ20 వరల్డ్కప్లో భారత్ హాట్ ఫేవరెట్గా నిలిచింది.
భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ 3 వికెట్లతో సహకరించగా, వరుణ్ చక్రవర్తి మరియు రింకూ సింగ్ చెరో వికెట్ తీశారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో ఫిన్ అలెన్ 80 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, రచిన్ రవీంద్ర 30 పరుగులు చేశారు. చివర్లో ఇష్ సోధీ 33 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత బ్యాటర్లు కివీస్ బౌలర్లపై ఆకాశమే హద్దుగా చెలరేగారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 271 పరుగుల భారీ స్కోర్ నమోదు చేశారు. సంజూ శాంసన్ ఆరంభంలోనే ఔటైనప్పటికీ, మిగతా బ్యాటర్లు న్యూజిలాండ్ బౌలింగ్ను పూర్తిగా ఉతికారేశారు.
వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ విధ్వంసకర సెంచరీతో మ్యాచ్ను ఏకపక్షంగా మార్చాడు. సంజూ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్, ప్రత్యర్థి బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. మొత్తం 43 బంతులు ఎదుర్కొన్న ఇషాన్, 4 ఫోర్లు మరియు 10 సిక్స్లతో 103 పరుగులు చేసి ప్రేక్షకులను అలరించాడు.
అతనికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన మద్దతు ఇచ్చాడు. సూర్య 30 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 63 పరుగులు చేసి మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 42), అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30) కూడా దూకుడుగా ఆడి భారీ స్కోర్కు బాటలు వేశారు.
న్యూజిలాండ్ బౌలర్లలో ఫెర్గూసన్ రెండు వికెట్లు తీయగా, శాంట్నర్, జేమిసన్, డఫీ తలా ఒక వికెట్ సాధించారు.
మరిన్నివార్తలుచదవండి: టీ20 ప్రపంచ కప్ 2026 ఆస్ట్రేలియా జట్టు ప్రకటింపు, ప్యాట్ కమిన్స్ దూరం