IPL

India vs Pakistan Clash: SLC Appeals to PCB Ahead of T20 World Cup 2026

by Guna SRV

టీమిండియాతో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పాకిస్తాన్ చేసిన ప్రకటనపై పునరాలోచన చేయాలని శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) విజ్ఞప్తి చేసింది. భారత్–పాకిస్తాన్ హై వోల్టేజ్ పోరుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్న లంక బోర్డు, తమకు నష్టం కలిగించేలా వ్యవహరించవద్దని పాకిస్తాన్‌ను కోరింది.

ఈ సందర్భంగా పాకిస్తాన్‌లో గతంలో తమ జట్టుపై జరిగిన ఉగ్రదాడిని (2009 లాహోర్ దాడి) ప్రస్తావిస్తూ, పాక్ వాదనలకు గట్టి కౌంటర్ ఇచ్చింది. టీ20 ప్రపంచకప్‌–2026కు భారత్ ఆతిథ్యం ఇస్తుండగా, ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ మ్యాచ్‌లకు శ్రీలంకను తటస్థ వేదికగా కేటాయించారు. అయితే భద్రతా కారణాలు చూపుతూ బంగ్లాదేశ్ కూడా లంకలోనే మ్యాచ్‌లు ఆడాలని పట్టుబట్టడంతో, ఐసీసీ ఆ జట్టును టోర్నీ నుంచి తొలగించింది.

భారత్‌లో బంగ్లాదేశ్ జట్టుకు పూర్తి భద్రత కల్పిస్తామని ఐసీసీ హామీ ఇచ్చినా వారు వినకపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ ప్రకటించడం సంచలనం సృష్టించింది. అదే జరిగితే, ఈ మ్యాచ్‌పై భారీగా పెట్టుబడి పెట్టిన ఐసీసీతో పాటు బ్రాడ్‌కాస్టర్లు భారీ నష్టాన్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. అంతేకాదు, ఐసీసీ సభ్య దేశాలకు వచ్చే ఆదాయంపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో, తమపై కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని భావించిన శ్రీలంక క్రికెట్ బోర్డు పాకిస్తాన్‌కు అధికారికంగా లేఖ రాసింది.
“కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు మీడియా ద్వారా తెలిసింది. ప్రపంచకప్ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ చాలా కాలం క్రితమే ఖరారైంది.

ఈ మ్యాచ్ కోసం భద్రతా ఏర్పాట్లు, టికెట్ల విక్రయం, ఆతిథ్య ఏర్పాట్లు, వాణిజ్య కార్యకలాపాలు సహా ప్రతి అంశం ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గౌరవపూర్వకంగా మీకు కొన్ని విషయాలు గుర్తుచేయాలనుకుంటున్నాం” అని లేఖలో పేర్కొంది.

అంతేకాదు, భద్రతాపరంగా అత్యంత సున్నిత పరిస్థితులు నెలకొన్న సమయంలోనూ పాకిస్తాన్‌లో పర్యటించిన తొలి జట్టుగా శ్రీలంకే నిలిచిందని గుర్తు చేసింది. గతంలో లాహోర్‌లో తమ జట్టు కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో పలువురు శ్రీలంక ఆటగాళ్లు, అధికారులు గాయపడ్డారని, వారిలో కొందరు ఇప్పటికీ ఆ గాయాల ప్రభావంతో బాధపడుతున్నారని స్పష్టం చేసింది.

ఇటీవల పాకిస్తాన్‌లో బాంబు దాడుల భయం ఉన్నప్పటికీ, తాము పర్యటనను మధ్యలో ఆపకుండా మ్యాచ్‌లు పూర్తి చేశామని, ఇప్పటికీ పాక్ క్రికెట్‌తో అంతర్జాతీయ స్థాయిలో పరస్పర సహకారానికి సిద్ధంగానే ఉన్నామని లంక బోర్డు పేర్కొంది.

విదేశీ జట్లు పాకిస్తాన్‌కు వెళ్లేందుకు సందేహించిన కాలంలో, ముందడుగు వేసి అక్కడికి వెళ్లింది శ్రీలంకేనని గుర్తుచేస్తూ, తమ దేశంలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌కు భద్రతా సమస్యలు ఉంటాయన్న పాక్ వాదన సరైంది కాదని పరోక్షంగా చురకలు అంటించింది.

గమనార్హమేమిటంటే, 2009లో గడాఫీ స్టేడియం నుంచి బయలుదేరిన శ్రీలంక జట్టు బస్సుపై 12 మంది ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో కొంతమంది అధికారులు ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు శ్రీలంక క్రికెటర్లు గాయపడ్డారు. అప్పటి కెప్టెన్ మహేళ జయవర్ధనే, స్టార్ బ్యాటర్ కుమార్ సంగక్కర కూడా గాయాలపాలయ్యారు. పాకిస్తాన్ అంపైర్ అహ్సాన్ రజా మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.

ఈ ఘటన తర్వాత చాలా కాలం పాటు విదేశీ జట్లు పాకిస్తాన్‌లో పర్యటించేందుకు భయపడ్డాయి. అయినప్పటికీ, ఇటీవలి కాలంలోనూ భద్రతా సవాళ్ల మధ్య పాక్–లంక మ్యాచ్‌లు విజయవంతంగా జరిగాయి. ఈ నేపథ్యంలో శ్రీలంక జట్టుకు కృతజ్ఞతగా పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ చేతులు జోడించి నమస్కరించిన ఘటన కూడా అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.