India vs Pakistan U19: Massive 90-Run Victory for India

అండర్-19 ఆసియా కప్ 2025లో భారత యువ జట్టు దూకుడు కొనసాగుతోంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం దాయాది పాకిస్తాన్తో జరిగిన కీలక మ్యాచ్లో టీమిండియా 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో, 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పాక్ జట్టు పూర్తిగా చతికిలపడింది.
భారత బౌలర్ల దాటికి పాకిస్తాన్ అండర్-19 జట్టు 41.2 ఓవర్లలో కేవలం 150 పరుగులకే ఆలౌటైంది. దీపేష్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ తలా మూడు వికెట్లు తీసి పాక్ పతనానికి కారణమయ్యారు. వీరికి తోడు కిషాన్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా పేసర్ దీపేష్ పవర్ప్లేలోనే మూడు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు.
పాక్ బ్యాటర్లలో హుజైఫా అహ్సాన్ (83 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 70 పరుగులు) ఒంటరి పోరాటం చేశాడు. ఒక వైపు వరుసగా వికెట్లు పడుతున్నా, మరోవైపు అహ్సాన్ మాత్రం దూకుడుగా ఆడి భారత్పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు.
అయితే, ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో అహ్సాన్ ఇన్నింగ్స్కు తెరపడింది. పాక్ ఇన్నింగ్స్లో కేవలం ముగ్గురు బ్యాటర్లే డబుల్ డిజిట్ స్కోర్ సాధించగలిగారు.
అదరగొట్టిన ఆరోన్
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 46.1 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో ఆరోన్ జార్జ్ (85) టాప్ స్కోరర్గా నిలవగా, కనిష్క్ చౌహాన్ (46), ఆయుష్ మాత్రే (38) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. అయితే, భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ (5) ఈ మ్యాచ్లో నిరాశపరిచాడు.
పాకిస్తాన్ బౌలర్లలో మహ్మద్ సయ్యామ్, అబ్దుల్ సుభాన్ తలా మూడు వికెట్లు తీసి భారత బ్యాటింగ్ను కట్టడి చేశారు.
మరిన్ని వార్తలు చదవండి: భారీ అంచనాల మధ్య విఫలమైన వైభవ్.. పాకిస్తాన్పై కేవలం 5 పరుగులే