IPL

India vs South Africa T20I: Suryakumar Yadav’s Poor T20 Form Raises Big Questions

by Krishna R

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం తీవ్ర ఫామ్ లోపంతో సతమతమవుతున్నాడు. దాదాపు రెండేళ్లపాటు ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా కొనసాగిన సూర్య, 2025లో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఈ ముంబై ఆటగాడు అభిమానులను నిరాశపరుస్తున్నాడు.

తొలి టీ20 మ్యాచ్‌లో కేవలం 12 పరుగులకే పరిమితమైన సూర్య, రెండో టీ20లో అయితే ఐదు పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. 2026 టీ20 ప్రపంచకప్‌కు ముందు కెప్టెన్‌ ఇలాంటి పేలవ ఫామ్‌లో ఉండటం జట్టు మేనేజ్‌మెంట్‌కు ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా సూర్యకుమార్ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు చేశారు.

కెప్టెన్ అంటే కేవలం టాస్ వేయడం, ఫీల్డింగ్ సెటప్ చేయడం లేదా వ్యూహాలు రూపొందించడం మాత్రమే కాదని, అవసరమైన సమయంలో పరుగులు చేయడం కూడా అంతే ముఖ్యమని చోప్రా స్పష్టం చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు సూర్య 18 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడి, సగటు 15.07తో కేవలం 196 పరుగులే సాధించాడు.

“సూర్య భారత జట్టుకు కెప్టెన్ అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. కెప్టెన్ బాధ్యత టాస్‌లు వేయడం లేదా బౌలర్లను రొటేట్ చేయడమే కాదు. బ్యాట్‌తో కూడా జట్టును ముందుకు నడిపించాలి. టాప్ ఫోర్‌లో బ్యాటింగ్‌కు వచ్చేటప్పుడు తప్పనిసరిగా పరుగులు సాధించాలి. ఈ ఏడాది అతడు చాలా మ్యాచ్‌లు ఆడినా, అతడి ఆటలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.

ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడి కేవలం 15 సగటు మాత్రమే కలిగి ఉన్నాడు. స్ట్రైక్ రేట్ కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఇప్పటివరకు ఒక్క అర్థ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. ఐపీఎల్‌కు ముందు, తర్వాత కూడా అతడి ఫామ్‌లో పెద్దగా తేడా కనిపించలేదు.

మూడో లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి పరుగులు చేయలేకపోతే, జట్టుపై ఎప్పటికీ అదనపు భారమే పడుతుంది. ఇలాంటి ఫామ్‌తో టీ20 ప్రపంచకప్‌లో ఎలా రాణిస్తారు?” అని చోప్రా ప్రశ్నించారు. అలాగే కెప్టెన్‌తో పాటు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా త్వరగా తన ఫామ్‌ను తిరిగి అందుకోవాల్సిన అవసరం ఉందని ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు చదవండి: దేశవాళీ క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ షాక్! అస్సాంలో నలుగురు ఆటగాళ్లు సస్పెండ్