Indian Cricket in Mourning: Mizoram Cricketer K Lalremruta Dies of Heart Attack

భారత క్రికెట్లో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మిజోరం రాష్ట్రానికి చెందిన ఫస్ట్క్లాస్ క్రికెటర్ కె. లాల్రెమ్రుటా (38) అకస్మాత్తుగా గుండెపోటుతో కన్నుమూశాడు. ఈ విషయాన్ని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ మిజోరం (CAM) అధికారికంగా ధ్రువీకరించింది.
ప్రస్తుతం మిజోరం రాజధాని ఐజ్వాల్కు సమీపంలోని సిహ్ముయ్ ప్రాంతంలో సెకండ్ డివిజన్ స్క్రీనింగ్ టోర్నమెంట్ జరుగుతోంది. ఈ టోర్నీలో వెంగ్నువాయ్ రైడర్స్ క్రికెట్ క్లబ్ తరఫున ఆడుతున్న లాల్రెమ్రుటా, గురువారం చాన్పుయ్ క్రికెట్ క్లబ్తో జరుగుతున్న మ్యాచ్ మధ్యలో ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలిపోయాడు.
పరిస్థితి గమనించిన వెంటనే సహచర ఆటగాళ్లు, నిర్వాహకులు అతడిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
లాల్రెమ్రుటా అకాల మరణం మిజోరం క్రికెట్ వర్గాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ ఘటనపై క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ మిజోరం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.
“లాల్రెమ్రుటా మిజోరం తరఫున రెండు రంజీ ట్రోఫీ మ్యాచ్ల్లో ప్రాతినిథ్యం వహించాడు.
అలాగే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఏడు మ్యాచ్లు ఆడి తన ప్రతిభను చాటుకున్నాడు. రాష్ట్ర స్థాయిలో అనేక కీలక మ్యాచ్ల్లో నిలకడైన ప్రదర్శనతో గుర్తింపు పొందాడు. మిజోరం ఒక ప్రతిభావంతమైన క్రికెటర్ను కోల్పోయింది. అతని కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి” అని సీఏఎం పేర్కొంది.
ఈ విషాద ఘటనపై మిజోరం క్రీడా శాఖ మంత్రి లాల్గింగ్లోవాహ్మర్ కూడా తీవ్ర సంతాపం తెలిపారు. లాల్రెమ్రుటా మరణం మిజోరం క్రికెట్కు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
మరిన్ని వార్తలు చదవండి: తిలక్ వర్మ గాయంపై స్పష్టత – న్యూజిలాండ్ సిరీస్ చివరి టీ20లకు అందుబాటులో ఉండే అవకాశం