IPL

India’s Massive 2026 Schedule Revealed: Sri Lanka Tests, Bangladesh Tour & More

by IPL Web Desk

India’s Massive 2026 Schedule Revealed: Sri Lanka Tests, Bangladesh Tour & Moreభారత్ జట్టు 2026 అంతర్జాతీయ షెడ్యూల్ ఇటీవలి కాలంలోనే అత్యంత రద్దీగా మారనుంది. అన్ని ఫార్మాట్లలో కలిపి టీమిండియా దాదాపు 50 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం కనిపిస్తోంది. ఈ భారీ షెడ్యూల్ మధ్య భారత్ శ్రీలంక పర్యటనపై కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.

క్రిక్‌బజ్ కథనం ప్రకారం, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌లో భాగంగా భారత్ జట్టు ఆగస్టు రెండోార్థంలో శ్రీలంకతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.

ఐపీఎల్ 2026 అనంతరం అఫ్గానిస్థాన్‌తో జరగనున్న ఒక్క టెస్ట్ మ్యాచ్‌ను తప్పిస్తే, ఈ ఏడాది భారత జట్టుకు ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌ల భారం లేదు. విదేశీ పర్యటనల పరంగా చూస్తే కేవలం రెండు టెస్ట్ సిరీస్‌లే షెడ్యూల్‌లో ఉన్నాయి.

ఆగస్టులో శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో శ్రీలంక పర్యటన జరగనుండగా, నవంబర్‌లో న్యూజిలాండ్ పర్యటన మరో కీలక టెస్ట్ సిరీస్‌గా నిలవనుంది.

ఇప్పటివరకు అధికారిక షెడ్యూల్ విడుదల కాలేదు. అయితే ఆగస్టు 15 నుంచి 27 మధ్య ఈ టెస్ట్ సిరీస్ నిర్వహించేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు, బీసీసీఐ మధ్య ప్రాథమిక అంగీకారం కుదిరినట్లు సమాచారం.

లంకా ప్రీమియర్ లీగ్ ముగిసిన వెంటనే టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఎల్పీఎల్ ఫైనల్ ఆగస్టు 8న జరగనుండగా, ఆగస్టు 9ను రిజర్వ్ డేగా నిర్ణయించారు.

భారత్ జట్టు మేనేజ్‌మెంట్‌తో పాటు అన్ని ప్రధాన వర్గాలకు ఈ తాత్కాలిక షెడ్యూల్‌పై ఇప్పటికే సమాచారం అందినట్లు తెలుస్తోంది. అయితే ఈ పర్యటనలో భాగంగా ప్రతిపాదించిన మూడు టీ20 మ్యాచ్‌ల భవితవ్యంపై ఇంకా స్పష్టత రాలేదు.

గత ఏడాది డిట్వా తుఫాన్ బాధితుల సహాయార్థం ఈ టీ20 మ్యాచ్‌లను నిర్వహించాలని భావించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటికే రద్దీగా ఉన్న వైట్‌బాల్ షెడ్యూల్‌లో వాటికి సమయం కేటాయించడం బీసీసీఐకి సవాల్‌గా మారింది.

శ్రీలంక ప్రభుత్వం ఇటీవల శ్రీలంక క్రికెట్ బోర్డు పరిపాలనను రద్దు చేసి తాత్కాలిక ట్రాన్స్‌ఫర్మేషన్ కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో ఐసీసీ ప్రతినిధి బృందంలో భాగంగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నారు.

ఈ పర్యటనలో అదనపు టీ20 మ్యాచ్‌ల నిర్వహణపై చర్చలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు.

శ్రీలంక పర్యటన ముగిసిన వెంటనే భారత్‌కు మరో భారీ షెడ్యూల్ ఎదురుకానుంది. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ఆరు వైట్‌బాల్ మ్యాచ్‌లు ఆడే అవకాశముంది.

ఇటీవల ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారత్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ప్రత్యేకంగా సమయం ఖాళీగా ఉంచినట్లు సమాచారం. అందుకే ఈ సిరీస్ దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది.

అంతేకాదు, సెప్టెంబర్ చివర్లో యూఏఈ వేదికగా అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20 మ్యాచ్‌లు కూడా జరిగే అవకాశముంది.

సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 3 వరకు ఆసియా క్రీడల షెడ్యూల్ ఉండగా, ఆ తర్వాత వెస్టిండీస్‌తో స్వదేశంలో వైట్‌బాల్ సిరీస్ కూడా జరగనుంది. దీంతో భారత ఆటగాళ్లు, జట్టు మేనేజ్‌మెంట్‌పై మరింత ఒత్తిడి పెరగనుంది.

భారత్-బంగ్లాదేశ్ వైట్‌బాల్ సిరీస్ సెప్టెంబర్ 1, 3 తేదీల్లో మీర్పూర్ వేదికగా వన్డే మ్యాచ్‌లతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మూడో వన్డే సెప్టెంబర్ 6న చట్టోగ్రామ్‌లో జరగనుంది.

ఆ తర్వాత టీ20 సిరీస్ సెప్టెంబర్ 9న చట్టోగ్రామ్‌లో మొదలై, చివరి రెండు మ్యాచ్‌లు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో మీర్పూర్‌లో జరిగే అవకాశముంది.

ఇంత భారీ అంతర్జాతీయ షెడ్యూల్ మధ్య ఆటగాళ్ల పనిభారం నిర్వహణ బీసీసీఐకి అతిపెద్ద సవాల్‌గా మారనుంది. ముఖ్య ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను కాపాడుతూ, అన్ని ఫార్మాట్లలో జట్టును పోటీదారుగా నిలబెట్టేందుకు రొటేషన్ విధానాన్ని అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత్ vs బంగ్లాదేశ్ వైట్‌బాల్ సిరీస్ షెడ్యూల్ (తాత్కాలికం)

మ్యాచ్ తేదీ వేదిక
1వ వన్డే సెప్టెంబర్ 1 మీర్పూర్
2వ వన్డే సెప్టెంబర్ 3 మీర్పూర్
3వ వన్డే సెప్టెంబర్ 6 చట్టోగ్రామ్
1వ టీ20 సెప్టెంబర్ 9 చట్టోగ్రామ్
2వ టీ20 సెప్టెంబర్ 12 మీర్పూర్
3వ టీ20 సెప్టెంబర్ 13 మీర్పూర్