Indonesia’s Gede Priandana Becomes First Bowler to Take 5 Wickets in an Over in T20I

అంతర్జాతీయ టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర నమోదైంది. ఇప్పటివరకు ఎవరూ సాధించని అరుదైన ఘనతను ఓ బౌలర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే ఓవర్లో హ్యాట్రిక్తో పాటు మొత్తం ఐదు వికెట్లు పడగొట్టి ప్రపంచ క్రికెట్ను ఆశ్చర్యానికి గురి చేశాడు. అంతర్జాతీయ టీ20ల చరిత్రలో ఇలాంటి ఫీట్ నమోదవడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఇంతకుముందు అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్లో గరిష్టంగా నాలుగు వికెట్లు మాత్రమే నమోదయ్యాయి. 2019లో శ్రీలంక లెజెండరీ పేసర్ లసిత్ మలింగ న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. అయితే ఇప్పుడు ఆ రికార్డును దాటి మరో మెట్టు ఎక్కింది ఈ ఘనత.
మొత్తం టీ20 క్రికెట్ను (అంతర్జాతీయం, దేశవాళీ, ప్రైవేట్ లీగ్లు కలిపి) పరిశీలిస్తే, ఒకే ఓవర్లో ఐదు వికెట్లు పడగొట్టిన ఘనత ఇంతకు ముందు రెండు సార్లు మాత్రమే నమోదైంది. బంగ్లాదేశ్ దేశవాళీ టీ20ల్లో అల్-అమిన్ హొసైన్, భారతదేశ దేశవాళీ క్రికెట్లో కర్ణాటక ఆటగాడు అభిమన్యు మిథున్ ఈ అరుదైన ఫీట్ సాధించారు.
అంతర్జాతీయ టీ20ల్లో ఈ అసాధారణ ఘనత సాధించిన తొలి బౌలర్గా ఇండోనేషియాకు చెందిన గెడే ప్రియందనా చరిత్రలో నిలిచిపోయాడు. పురుషులు గానీ, మహిళలు గానీ — ఎవ్వరూ చేయని విధంగా, తన తొలి ఓవర్లోనే ఐదు వికెట్లు పడగొట్టి ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. బాలి వేదికగా కాంబోడియాతో జరిగిన మ్యాచ్లో ఈ అద్భుతం చోటు చేసుకుంది.
ఇండోనేషియా నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కాంబోడియా జట్టు 15 ఓవర్లకు 106/5 స్కోర్తో నిలిచింది. ఈ దశలో మీడియం పేసర్ అయిన ప్రియందనాను బౌలింగ్కు తీసుకొచ్చారు. అప్పటి వరకు మ్యాచ్ కాంబోడియా వైపు ఉన్నట్లే కనిపించింది. కానీ 16వ ఓవర్లో ప్రియందనా ఒక్కసారిగా మ్యాచ్ను తలకిందులు చేశాడు.
ఆ ఓవర్ తొలి మూడు బంతుల్లో వరుసగా షా అబ్రార్ హుస్సేన్, నర్మల్జిత్ సింగ్, చాంతోయున్ రథనక్లను ఔట్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. నాలుగో బంతికి పరుగులేమీ రాకపోగా, ఐదో మరియు ఆరవ బంతుల్లో మాంగ్దారా సోక్, పెల్ వెన్నక్లను పెవిలియన్కు పంపి మొత్తం ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఆ ఓవర్లో కేవలం ఒక్క వైడ్ రన్ మాత్రమే నమోదైంది.
ప్రియందనా ఒక్క ఓవర్లో చేసిన ఈ విధ్వంసంతో కాంబోడియా ఇన్నింగ్స్ పూర్తిగా కూలిపోయింది. ఫలితంగా ఇండోనేషియా జట్టు 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు ఇండోనేషియా ఇన్నింగ్స్లో ధర్మ కేసుమా అద్భుతంగా రాణించాడు. 68 బంతుల్లో 110 పరుగులు (నాటౌట్) చేస్తూ విధ్వంసకర శతకం నమోదు చేయడంతో ఇండోనేషియా నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేయగలిగింది.
ఈ మ్యాచ్తో పాటు గెడే ప్రియందనా పేరు ఇప్పుడు అంతర్జాతీయ టీ20 చరిత్రలో బంగారు అక్షరాలతో నిలిచిపోయింది.
మరిన్ని వార్తలు చదవండి: మహిళా క్రికెటర్లకు బీసీసీఐ బంపర్ గుడ్ న్యూస్.. మ్యాచ్ ఫీజులు 2.5 రెట్లు పెంపు