IPL 2026 Auction: Five Overseas Players Declare Limited Availability to BCCI
ఐపీఎల్ 2026 వేలానికి మొత్తం 1,355 మంది ఆటగాళ్లు నమోదు చేసుకున్నా, వారిలో ఐదుగురు మాత్రం వచ్చే సీజన్కు తాము పూర్తిగా అందుబాటులో ఉండలేమని బీసీసీఐకి అధికారికంగా తెలియజేశారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన అస్టన్ అగర్, విలియమ్ సదర్లాండ్, న్యూజిలాండ్ పేసర్ ఆడమ్ మిల్నే, దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ రీలీ రుసో, ఆస్ట్రేలియా వికెట్కీపర్ జోష్ ఇంగ్లిస్ ఉన్నారు. వీరు తామెంత శాతం మ్యాచ్లు ఆడగలమో స్పష్టంగా చెప్పటం వల్ల, వేలంలో వారి అవకాశాలపై ఇది ప్రత్యక్ష ప్రభావం చూపనుంది.
అస్టన్ అగర్ మాత్రం సీజన్లో 65% మ్యాచ్లకే అందుబాటులో ఉంటానని చెప్పాడు. విలియమ్ సదర్లాండ్ 80% అని పేర్కొన్నాడు. ఇద్దరూ తొలిసారి ఐపీఎల్ వేలానికి వస్తుండగా, అగర్ ₹2 కోట్ల టాప్ బ్రాకెట్లో, సదర్లాండ్ ₹1 కోటి బేస్ ప్రైస్తో నమోదు అయ్యారు. హై రిజర్వ్ ప్రైస్ + పరిమిత అందుబాటు, ఈ రెండు కారణాలు ఫ్రాంచైజీలను ఆలోచింపజేయొచ్చు. అయితే ఇద్దరూ ఇంటర్నేషనల్ క్రికెట్లో మంచి ఆల్రౌండర్స్ కావడం వల్ల ఆసక్తి మాత్రం ఉంటుంది.
ఇటీవల గాయాలతో ఇబ్బంది పడ్డ న్యూజిలాండ్ వేగవంతుడు ఆడమ్ మిల్నే ఈ సీజన్కు 95% అందుబాటులో ఉంటానని తెలిపాడు. 33 ఏళ్ల మిల్నేకు గతంలో ఐపీఎల్ అనుభవం ఉన్నప్పటికీ, వరుసగా మూడు సీజన్లుగా అతను అమ్ముడుపోలేదు. ఈసారి కూడా అతను ₹2 కోటి బేస్ ప్రైస్తో వచ్చాడు. అందుబాటు దాదాపు ఫుల్ ఉన్నా, గాయాల చరిత్ర, అస్థిర ఫాం, ఇవి అతని వేలం అవకాశాలను ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయి.
దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ రీలీ రుసో పరిస్థితి అత్యంత క్లిష్టం. 2014లో అరంగేట్రం చేసినప్పటి నుండి కేవలం 22 మ్యాచ్లే ఆడిన రుసో, IPL 2026లో 20% మాత్రమే అందుబాటులో ఉంటానని తెలిపాడు ,అంటే మూడు నాలుగు మ్యాచ్లు మాత్రమే. 36 ఏళ్ల వయసులో, ఇంత తక్కువ అందుబాటు ఉన్నప్పుడు, ఈసారి అతని వేలం అవకాశాలు చాలా స్వల్పం.
ఐదవ ఆటగాడు జోష్ ఇంగ్లిస్. అతను 25% మాత్రమే అందుబాటులో ఉంటానని చెప్పాడు. అప్పటికే గబ్బాలో జరుగుతున్న యాషెస్ టెస్టులో ఉన్న ఇంగ్లిస్, గరిష్టంగా నాలుగు మ్యాచ్లకే వస్తానని బీసీసీఐకి సమాచారం అందించాడు. అతను కూడా ₹2 కోటి బేస్ ప్రైస్లోనే వచ్చాడు. గత సీజన్లో అద్భుతంగా ఆడినా, అతని పరిమిత అందుబాటు ఫ్రాంచైజీలను వెనక్కు నెట్టే అవకాశం ఉంది.
పరిమిత అవైలబిలిటీతో జట్ల బిడ్డింగ్ తగ్గే అవకాశం
ఇంగ్లిస్ IPL 2025లో పంజాబ్ కింగ్స్ తరఫున 11 మ్యాచ్ల్లో 278 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్పై చివరి లీగ్ మ్యాచ్లో 42 బంతుల్లో 73 పరుగులు చేయడం, క్వాలిఫయర్-2లో బుమ్రా ఓవర్లో 20 పరుగులు తీసి మ్యాచ్ను తిప్పేయడం అతని హైలైట్స్. అయినా చివరి నిమిషంలో అతడిని పంజాబ్ కింగ్స్ విడుదల చేసింది, ఎందుకంటే అతను IPL విండో తన పెళ్లితో క్లాష్ అవుతుందని ఫ్రాంచైజీకి తెలిపాడు.
ఇలా ఇంగ్లిస్, అగర్, మిల్నే ముగ్గురూ ₹2 కోటి బ్రాకెట్లో, సదర్లాండ్ ₹1 కోటి వద్ద వేలానికి వస్తున్నారు. కానీ హై బేస్ ప్రైస్ + రిలేటెడ్ అందుబాటు, ఈ కాంబినేషన్ బిడ్డింగ్ను తగ్గించే అవకాశం ఉంది. డిసెంబర్ 16న అబూదాబిలో వేలం జరగనుండగా, జట్లు ఇప్పుడు ఈ ఐదుగురు కొద్ది మ్యాచ్లు మాత్రమే ఆడినా పెట్టుబడి పెట్టటం విలువైందా లేదా అనేది గణించిన తర్వాతే బిడ్లు వేస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్లో స్క్వాడ్ డెప్త్, ఫుల్ అవైలబిలిటీ వంటి అంశాలు టోర్నమెంట్ విజయాన్ని నిర్ణయించే స్థాయిలో ఉన్నాయి.