IPL

IPL 2026: BCCI Signs ₹270 Crore Deal with Google Gemini

by Krishna R

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పరిధిలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌) 2026 నుంచి కొత్త భాగస్వామిని దక్కించుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రపంచ దిగ్గజంగా ఉన్న గూగుల్ జెమినీ (Google Gemini)తో ఐపీఎల్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ఐపీఎల్‌ 2026 సీజన్‌ నుంచి ప్రారంభమై 2028 సీజన్‌ వరకు కొనసాగనుంది. మొత్తం మూడు సంవత్సరాల పాటు అమలులో ఉండే ఈ డీల్ విలువ సుమారు రూ.270 కోట్లుగా ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే జెమినీ ప్రత్యర్థి అయిన చాట్‌జీపిటీ (ChatGPT) వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌ (WPL)తో ఒప్పందం కుదుర్చుకోవడంతో, ఏఐ సంస్థల మధ్య క్రికెట్ మార్కెట్‌లో పోటీ మరింత పెరిగింది. అయితే ఐపీఎల్‌తో జెమినీ కుదుర్చుకున్న ఒప్పందం మాత్రం డబ్ల్యూపీఎల్‌తో చాట్‌జీపిటీ చేసిన ఒప్పందంతో పోలిస్తే చాలా పెద్దది. చాట్‌జీపిటీ డబ్ల్యూపీఎల్‌తో చేసుకున్న డీల్ విలువ కేవలం రూ.17 కోట్లే కావడం గమనార్హం.

ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం, ఐపీఎల్–గూగుల్ జెమినీ ఒప్పందం ద్వారా మాత్రమే రూ.270 కోట్ల ఆదాయం లభించనుంది. ఇక మొత్తం క్రికెట్ ప్రకటనల రంగంలో ఏఐ సంస్థలు ఖర్చు చేసే మొత్తం రూ.300 నుంచి రూ.400 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో ఏఐ బ్రాండ్లు స్పోర్ట్స్ మార్కెటింగ్‌లో ఎంత కీలక పాత్ర పోషించబోతున్నాయో సూచిస్తోంది.

ఇదిలా ఉండగా, 2025లో ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ గేమింగ్ ప్రొమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్ నేపథ్యంలో రియల్ మనీ ఆన్‌లైన్ గేమింగ్‌పై నిషేధం విధించడంతో పాటు, అలాంటి సంస్థల ప్రకటనలపై కూడా ఆంక్షలు విధించారు. దీని ప్రభావంతో డ్రీమ్11 సహా పలువురు ఫాంటసీ గేమింగ్ స్పాన్సర్లు క్రికెట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి టీమ్ ఇండియాకు అపోలో టైర్స్ స్పాన్సర్‌గా వచ్చాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో ఫాంటసీ గేమింగ్ సంస్థలు వెళ్లిపోవడం వల్ల కలిగిన ఆర్థిక నష్టాన్ని తగ్గించుకోవడమే కాకుండా, భవిష్యత్తు టెక్నాలజీగా మారుతున్న ఏఐ రంగం వైపు అడుగులు వేయాలనే ఉద్దేశంతోనే బీసీసీఐ ఈ జెమినీ ఒప్పందానికి ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.

ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ,
“2025 ఆన్‌లైన్ గేమింగ్ బిల్ అమల్లోకి వచ్చిన తర్వాత బీసీసీఐ, డ్రీమ్11 మధ్య భాగస్వామ్యం ముగిసింది. ఇకపై అలాంటి సంస్థలతో సంబంధాలు పెట్టుకోకుండా ఉండేందుకు బోర్డు నిర్ణయం తీసుకుంది” అని వార్తా సంస్థ ఏఎన్‌ఐకి తెలిపారు.

మొత్తంగా చూస్తే, ఐపీఎల్–గూగుల్ జెమినీ భాగస్వామ్యం భారత క్రికెట్‌లో టెక్నాలజీ, ముఖ్యంగా ఏఐ ప్రాధాన్యతను మరో మెట్టు పైకి తీసుకెళ్లే కీలక అడుగుగా భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు చదవండి: భారత్ vs దక్షిణాఫ్రికా మహిళల టీ20 సిరీస్ 2026 షెడ్యూల్ విడుదల