
డిఫెండింగ్ ఛాంపియన్గా ఐపీఎల్ 2026లో బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మినీ వేలంలో కీలక కొనుగోళ్లతో తమ జట్టును మరింత బలపర్చుకుంది. అబుదాబి వేదికగా జరిగిన ఈ వేలంలో ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ను రూ. 7 కోట్లకు సొంతం చేసుకోవడం ప్రధాన హైలైట్గా నిలిచింది.
గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, కోల్కతా నైట్ రైడర్స్ వంటి జట్లతో గట్టి పోటీ ఎదురైనా, చివరకు బెంగళూరు జట్టే అతడిని దక్కించుకుంది. గత సీజన్లో పంజాబ్ కింగ్స్ను ఓడించి తొలి ఐపీఎల్ టైటిల్ను అందుకున్న ఆర్సీబీ, ఈసారి కూడా అదే ఊపుతో టైటిల్ను నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ మినీ వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసిన ఆటగాళ్లలో వెంకటేష్ అయ్యర్తో పాటు మంగేష్ యాదవ్ను రూ. 5.2 కోట్లకు తీసుకుంది. న్యూజిలాండ్ పేసర్ జాకబ్ డఫీని రూ. 2 కోట్లకు జట్టులోకి చేర్చగా, జోర్డాన్ కాక్స్ను రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. సాత్విక్ దెస్వాల్, విక్కీ ఓస్త్వాల్, విహాన్ మల్హోత్రా, కనిష్క్ చౌహాన్లను రూ. 30 లక్షల చొప్పున దక్కించుకుంది.
ప్రస్తుత స్క్వాడ్ విషయానికి వస్తే, కెప్టెన్ రజత్ పాటిదార్తో పాటు విరాట్ కోహ్లీని కేంద్రంగా చేసుకుని తమ కోర్ టీమ్ను ఆర్సీబీ యథాతథంగా కొనసాగించింది. రజత్ పాటిదార్ నాయకత్వంలో విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్ వంటి కీలక ఆటగాళ్లు బ్యాటింగ్ విభాగానికి బలాన్ని అందిస్తున్నారు.
బౌలింగ్, ఆల్ రౌండర్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్, యష్ దయాల్, నువాన్ తుషార, రసిక్ సలాం, రొమారియో షెపర్డ్, జాకబ్ బెతెల్, స్వప్నిల్ సింగ్, సుయాష్ శర్మ, అభినందన్ సింగ్ లాంటి ఆటగాళ్లు జట్టుకు సమతుల్యతను తీసుకువస్తున్నారు.
అయితే ఈ సీజన్కు ముందు లియామ్ లివింగ్స్టోన్, మయాంక్ అగర్వాల్, లుంగి ఎంగిడి, స్వస్తిక్ చికారా, మనోజ్ భాండగే, మోహిత్ రథీ వంటి ఆటగాళ్లను ఆర్సీబీ విడుదల చేసింది.
మధ్యప్రదేశ్కు చెందిన రజత్ పాటిదార్ నాయకత్వంలో, వెంకటేష్ అయ్యర్ వంటి ఆల్ రౌండర్ చేరికతో ఆర్సీబీ జట్టు ఈసారి మరింత సమతుల్యంగా కనిపిస్తోంది. కోహ్లీ, పడిక్కల్, సాల్ట్లతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉండగా, భువనేశ్వర్ కుమార్, హాజిల్వుడ్ వంటి అనుభవజ్ఞులతో బౌలింగ్ కూడా బలంగా ఉంది. మొత్తం మీద ఐపీఎల్ 2026లో మరోసారి ఆర్సీబీ టైటిల్కు గట్టి పోటీ ఇవ్వనుందనే నమ్మకం అభిమానుల్లో పెరిగింది.
మరిన్ని వార్తలు చదవండి: IPL 2026 వేలం: టాప్ 10 అత్యంత ఖరీదైన ప్లేయర్లు పూర్తి జాబితా