IPL

IPL 2026: RCB to Play Home Matches at DY Patil and Raipur, Not Chinnaswamy

by Krishna R

డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) ఐపీఎల్‌ 2026 సీజన్‌కు ముందు కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతాపరమైన కారణాలతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు ఆడటంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతుండటంతో, తమ హోమ్‌ మ్యాచ్‌లను రెండు కొత్త వేదికల్లో నిర్వహించాలని ఫ్రాంఛైజీ నిర్ణయించింది.

ఇకపై నవీ ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ షాహీద్‌ వీర్‌ నారాయణ్‌ సింగ్‌ స్టేడియాలు ఆర్సీబీకి హోమ్‌ గ్రౌండ్లుగా ఉండనున్నాయి. ఐపీఎల్‌ 2025 టైటిల్‌ గెలిచిన అనంతరం బెంగళూరులో చోటుచేసుకున్న విషాదకర ఘటనల నేపథ్యంలో, మళ్లీ బెంగళూరులో మ్యాచ్‌లు నిర్వహించడంపై ఆర్సీబీ యాజమాన్యం వెనుకడుగు వేస్తోందనే వార్తలు ఇప్పటికే వినిపించాయి.

ఆ పరిణామాల మధ్య తాజాగా ఈ నిర్ణయం వెలుగులోకి వచ్చింది. నిజానికి 2008లో ఐపీఎల్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఆర్సీబీ తన అన్ని హోమ్‌ మ్యాచ్‌లను చిన్నస్వామి స్టేడియంలోనే ఆడుతూ వచ్చింది. అయితే గత సీజన్‌ విజయోత్సవ వేడుకల అనంతరం స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట పరిస్థితిని పూర్తిగా మార్చేసింది.

ఆ దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఫ్రాంఛైజీతో పాటు సంబంధిత అధికారులపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తడానికి కారణమైంది. అప్పటి నుంచే ఆర్సీబీ హోమ్‌ వేదిక మార్పుపై చర్చలు మొదలయ్యాయి.

ఐపీఎల్‌ 2026 సీజన్‌కు బెంగళూరులో మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఫ్రాంఛైజీ ఆసక్తి చూపడం లేదని సమాచారం. అంతేకాదు, చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణపై ఇప్పటివరకు కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ను కూడా అధికారికంగా సంప్రదించలేదని తెలుస్తోంది.

టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం ప్రకారం, వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీ తమ హోమ్‌ మ్యాచ్‌లను రెండు వేదికల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. నవీ ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో ఐదు మ్యాచ్‌లు, రాయ్‌పూర్‌లో రెండు మ్యాచ్‌లు ఆడేలా ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో లాజిస్టికల్‌, ఆపరేషనల్‌ అంశాలపై ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌ ఇప్పటికే ఆయా నగరాల అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు చదవండి: అలిస్సా హీలీ రిటైర్మెంట్: టీ20లకు గుడ్‌బై, భారత్ సిరీస్‌తో కెరీర్‌కు ముగింపు