ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఖరారు దశకు చేరుకుంటున్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తమ హోం మ్యాచ్లు ఏ నగరంలో నిర్వహించనున్నాయో జనవరి 27లోగా భారత క్రికెట్ నియంత్రణ మండలికి తెలియజేయాలని ఆదేశాలు అందాయి. టోర్నీ ప్రణాళికలను తుది రూపం ఇవ్వడానికి ముందుగా వేదికలపై స్పష్టత కావాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కోరుతోంది.
బెంగళూరులో ఆర్సీబీకి ఎదురైన సవాల్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ హోం మ్యాచ్లను సంప్రదాయంగా ఎం. చిన్నస్వామి స్టేడియంలోనే నిర్వహించాలని భావిస్తోంది. అయితే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలు ప్రధాన అడ్డంకిగా మారాయి. స్టేడియం లోపలి నిర్వహణతో పాటు బయట పరిసర ప్రాంతాలు, సమీప రహదారులు, ట్రాఫిక్ నియంత్రణ మొత్తం బాధ్యతను ఫ్రాంచైజీనే భరించాలని ప్రభుత్వం షరతులు విధించినట్లు సమాచారం.
అదే విధంగా మ్యాచ్ రోజుల్లో డీజే వినియోగంపై పరిమితులు, పరిసర ప్రాంతాల్లో అగ్నిమాపక బృందాల మోహరింపును కూడా తప్పనిసరి చేశారు. ఇవి క్రికెట్ ఫ్రాంచైజీ పరిధిని మించిన పరిపాలనా బాధ్యతలుగా ఆర్సీబీ భావిస్తోంది. అందుకే ఈ నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘంతో మరిన్ని చర్చలు జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుని బీసీసీఐకి తెలియజేయాలని ఆర్సీబీ యోచిస్తోంది.
గత జూన్లో ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ సంబరాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం, దాదాపు 50 మంది గాయపడటం తెలిసిందే. ఆ ఘటన తర్వాత న్యాయమూర్తి జాన్ మైకేల్ డి’కున్హా నేతృత్వంలోని స్వతంత్ర కమిటీ, చిన్నస్వామి స్టేడియాన్ని పెద్ద ఎత్తున ఈవెంట్లకు అనర్హమని వ్యాఖ్యానించింది. అవసరమైన నిర్మాణ, భద్రతా మార్పులు లేకుండా మ్యాచ్లు నిర్వహిస్తే ప్రజా భద్రతకు ముప్పు ఉంటుందని హెచ్చరించింది.
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో భారీ మార్పులు – ఏ+ గ్రేడ్కు గుడ్బై?
రాజస్థాన్ రాయల్స్కు జైపూర్ అనిశ్చితి
ఇక రాజస్థాన్ రాయల్స్ విషయంలోనూ స్పష్టత లేదు. జైపూర్లోని సవాయి మాన్సింగ్ స్టేడియం వినియోగంపై అనిశ్చితి కొనసాగుతోంది. రాజస్థాన్ క్రికెట్ సంఘంలో సంవత్సరాలుగా ఎన్నికలు జరగకపోవడంతో పరిపాలనా ప్రతిష్టంభన నెలకొంది. ఈ పరిస్థితి కారణంగా జైపూర్లో ఐపీఎల్ మ్యాచ్లు మళ్లీ జరగకపోవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
మొత్తంగా చూస్తే, ఐపీఎల్ 2026కు ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు–బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్–జైపూర్ అంశాలపై తుది నిర్ణయాలు జనవరి 27 నాటికి వెలువడాల్సి ఉంది. ఆ నిర్ణయాలే టోర్నీ వేదికల రూపురేఖలను నిర్ణయించనున్నాయి.
వేదికల మార్పు అభ్యర్థన తిరస్కరణ: బంగ్లాదేశ్కు 24 గంటల గడువు