Ishan T20 World Cup Selection Mother Breaks Down Emotionally

న్యూఢిల్లీ: 2026 టీ20 వరల్డ్ కప్కు బీసీసీఐ ప్రకటించిన టీమిండియా స్క్వాడ్లో యువ వికెట్కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్కు స్థానం లభించింది. శనివారం (డిసెంబర్ 20) ప్రకటించిన 15 మంది జట్టులో ఆయన పేరు చోటు దక్కించుకోవడం విశేషం.
సౌతాఫ్రికా సిరీస్కు ముందు వరకూ వరల్డ్ కప్ సన్నాహాల్లో ఇషాన్ కిషన్ పేరు కనిపించకపోయినా, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతను చూపిన అద్భుత ప్రదర్శన సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. ఈ టోర్నీలో పరుగుల వరద పారించడమే కాకుండా, కెప్టెన్గా జార్ఖండ్ జట్టుకు ముస్తాక్ అలీ ట్రోఫీని అందించి తన సత్తా ఏమాత్రం తగ్గలేదని స్పష్టమైన సందేశం ఇచ్చాడు.
దీంతో 2023 నవంబర్లో చివరిసారిగా టీమిండియా తరఫున ఆడిన ఈ జార్ఖండ్ ఆటగాడు, దాదాపు రెండేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ జట్టులో తన కుమారుడికి చోటు దక్కడంతో ఇషాన్ కిషన్ తల్లి భావోద్వేగానికి గురయ్యారు.
శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె, “దేవుడు ఒక తల్లి ప్రార్థనలను విన్నాడు. ఇషాన్ పడిన కష్టాన్ని దేవుడు చూశాడు” అంటూ భావోద్వేగంగా స్పందించారు. వ్యక్తిగత సమస్యల కారణంగా అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన తన కుమారుడు మళ్లీ టీమిండియా తరఫున ఆడాలని తాను నిరంతరం దేవుణ్ని ప్రార్థించానని చెప్పారు. తన ప్రార్థనలను దేవుడు స్వీకరించి, ఇషాన్కు టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు కల్పించాడని ఆమె తెలిపారు.
మరోవైపు, వరల్డ్ కప్కు ఎంపికైనందుకు ఇషాన్ కిషన్ కూడా ఆనందం వ్యక్తం చేశాడు. జాతీయ జట్టులోకి తిరిగి రావడమే కాకుండా వరల్డ్ కప్కు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. వరల్డ్ కప్కు సెలక్ట్ అయిన విషయం తెలిసిన వెంటనే ఎంతో హ్యాపీగా ఫీలయ్యానని ఆయన పేర్కొన్నాడు.
టీ20 వరల్డ్ కప్కు టీమిండియా స్క్వాడ్:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్కీపర్), వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా, జస్ప్రీత్ బుమ్రా.
మరిన్ని వార్తలు చదవండి: భారత్-న్యూజీలాండ్ వన్డే సిరీస్ 2026: జట్టు, స్టార్ క్రికెటర్ల విశ్రాంతి, తేదీలు మరియు షెడ్యూల్