Jason Gillespie Says No to Team India Head Coach Role

ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్, పాకిస్థాన్ మాజీ హెడ్ కోచ్ జాసన్ గిల్లెస్పీ భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నూతన సంవత్సర రోజైన గురువారం ఒక అభిమాని సోషల్ మీడియాలో “మీరు భారత టెస్టు జట్టు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవాలి” అని సూచించగా, గిల్లెస్పీ దీనికి సూటిగా “నో థాంక్స్” అంటూ స్పందించారు. ఈ ఒక్క సమాధానంతోనే ఆయన ఉద్దేశం ఏమిటో స్పష్టమైంది.
ఇటీవలే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో గిల్లెస్పీ ఆ దేశ హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేశారు. ఆయన కోచ్గా ఉన్న సమయంలో పాకిస్థాన్ సొంత గడ్డపై బంగ్లాదేశ్ చేతిలో పరాజయం ఎదుర్కొన్నప్పటికీ, ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్ను గెలుచుకుంది. అయినప్పటికీ, బోర్డుతో ఉన్న విభేదాలు ఆయన పదవీ విరమణకు దారితీశాయి.
ఈ పరిణామాల మధ్య భారత క్రికెట్ జట్టు ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం గంభీర్ స్థానంపై చర్చలు ఊపందుకున్నాయి. ఈ సమయంలో గిల్లెస్పీ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత జట్టుకు కోచింగ్ ఇవ్వడం అంటే కత్తి మీద సాము లాంటిదని, ఆ స్థాయి ఒత్తిడిని తట్టుకోవడం అంత సులభం కాదని ఆయన పరోక్షంగా చెప్పినట్టుగా భావిస్తున్నారు.
2024లో హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్, తన కాలంలో విజయాల కంటే పరాజయాలనే ఎక్కువగా ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా స్వదేశంలోనే భారత జట్టు వైట్వాష్ కావడం అభిమానులకు జీర్ణించుకోలేని విషయంగా మారింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రత్యామ్నాయాలపై ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
భారత టెస్టు జట్టు బాధ్యతలు స్వీకరించేందుకు దిగ్గజ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ను బోర్డు పెద్దలు అనధికారికంగా సంప్రదించారని ప్రచారం సాగుతోంది. అయితే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్గా కొనసాగడానికే లక్ష్మణ్ ఆసక్తి చూపుతున్నారని, హెడ్ కోచ్ పదవిపై పెద్దగా ఆసక్తి లేదని సమాచారం.
గంభీర్ కాంట్రాక్ట్ 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఉన్నప్పటికీ, టెస్టు ఫార్మాట్లో వరుస వైఫల్యాలు అతని భవిష్యత్తుపై ప్రశ్నార్థకంగా మారాయి. రాబోయే టీ20 ప్రపంచకప్ తర్వాత గంభీర్ కొనసాగింపుపై బీసీసీఐ సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణం సరిగా లేదని, ఆటగాళ్ల ఎంపిక విషయంలో గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తి ఉందన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
టెస్టు జట్టుకు ప్రత్యేకంగా మరో కోచ్ను నియమించే ఆలోచనలో బోర్డు ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి మాత్రం గంభీర్కే మద్దతుగా నిలుస్తోంది. అయితే పరిస్థితులు మారితే నిర్ణయాలు కూడా మారవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
భారత జట్టు హెడ్ కోచ్ పదవిని విదేశీ కోచ్లు “ముళ్ల కిరీటం”గా భావిస్తున్నారు. గతంలో రాహుల్ ద్రవిడ్ను కూడా ఈ బాధ్యతలు స్వీకరించేందుకు ఒప్పించడానికి బోర్డు చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. గంభీర్కు ముందు ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ ఈ పదవిపై ఆసక్తి చూపించినా, కేఎల్ రాహుల్ ఇచ్చిన సూచనతో వెనక్కి తగ్గినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. భారత క్రికెట్లో రాజకీయాలు, ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటాయని, అటువంటి వాతావరణంలో పనిచేయడం కష్టమని రాహుల్ తనకు చెప్పారని లాంగర్ అప్పట్లో వివరించారు.
ఇప్పుడు జాసన్ గిల్లెస్పీ కూడా అదే బాటలో నడుస్తూ, భారత జట్టు కోచ్ పదవికి దూరంగా ఉండటమే మంచిదని భావిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
మరిన్నివార్తలుచదవండి: యాషెస్ 2025–26 ఐదో టెస్ట్ కోసం ఆస్ట్రేలియా 15 మంది జట్టు ప్రకటణ