
టీమ్ఇండియా క్రికెటర్ కృష్ణప్ప గౌతమ్ తన క్రికెట్ ప్రయాణానికి వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్కు గుడ్బై చెబుతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. దీంతో 14 సంవత్సరాల పాటు సాగిన అతని క్రికెట్ కెరీర్కు ముగింపు పలికినట్లైంది.
లోయర్ ఆర్డర్లో పవర్ హిట్టింగ్ చేయగల సామర్థ్యం, నమ్మకమైన ఆఫ్ స్పిన్ బౌలింగ్తో గౌతమ్ మంచి గుర్తింపు సంపాదించాడు. రంజీ ట్రోఫీతో పాటు ఐపీఎల్లోనూ అతని ప్రదర్శనలు క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాయి. దేశవాళీ క్రికెట్లో కర్ణాటక జట్టుకు ఈ ఆల్రౌండర్ కీలకంగా వ్యవహరించాడు.
గౌతమ్ మొత్తం 59 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 68 లిస్ట్ ఏ మ్యాచ్లు ఆడి 320కి పైగా వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో బ్యాటింగ్లో కూడా కీలకమైన పరుగులు చేసి జట్టుకు ఎన్నో సందర్భాల్లో సహాయపడ్డాడు. 2023 వరకు కర్ణాటక క్రికెట్లో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగిన గౌతమ్, ఆ తర్వాత రాష్ట్ర జట్టుకు దూరమైనప్పటికీ దేశవాళీ క్రికెట్పై అతని ప్రభావం మాత్రం గణనీయంగానే నిలిచింది.
భారత జట్టు తరపున గౌతమ్ ఒక్క వన్డే మ్యాచ్ మాత్రమే ఆడాడు. 2021లో శ్రీలంకతో జరిగిన ఆ మ్యాచ్లో అతను బౌలింగ్లో ఒక వికెట్ తీసుకోగా, బ్యాటింగ్లో రెండు పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్లో 2018లో అరంగేట్రం చేసిన గౌతమ్, 2024 వరకు ఈ టోర్నీలో పాల్గొన్నాడు.
మొత్తం 36 ఐపీఎల్ మ్యాచ్ల్లో 21 వికెట్లు పడగొట్టడంతో పాటు 247 పరుగులు కూడా సాధించాడు. కృష్ణప్ప గౌతమ్ కెరీర్ దేశవాళీ క్రికెట్లో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతుంది.