IPL

KSCA Announces Special Tribute to Kumble, Dravid and Shantha Rangaswamy

by IPL Web Desk

KSCA Announces Special Tribute to Kumble, Dravid and Shantha Rangaswamyవెంకటేష్ ప్రసాద్ నేతృత్వంలోని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, భారత క్రికెట్ దిగ్గజాలు అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ లకు అరుదైన గౌరవం ప్రకటించింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రెండు స్టాండ్లకు వారి పేర్లు పెట్టాలని నిర్ణయించింది. కర్ణాటకతో పాటు భారత క్రికెట్‌కు వారు చేసిన అసాధారణ సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం తెలిపింది.

“కర్ణాటక క్రికెట్ తరతరాలపై ముద్ర వేసిన లెజెండ్స్ వీరు. తమ హోమ్ గ్రౌండ్‌గా భావించిన స్టేడియంలో వారి లెగసీ నిలవడం సహజం,” అని సంఘం ప్రకటనలో పేర్కొంది.

కుంబ్లే ఇప్పటికీ భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. టెస్ట్, వన్డే ఫార్మాట్లలో కలిపి 953 అంతర్జాతీయ వికెట్లు సాధించాడు. మరోవైపు ద్రావిడ్, టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. మొత్తం 504 మ్యాచ్‌లలో 24,064 పరుగులు నమోదు చేశాడు. ఈ ఇద్దరూ తమ కెరీర్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా సేవలందించారు. “వారి నాయకత్వం, క్రమశిక్షణ, అంకితభావం యువ క్రికెటర్లకు స్ఫూర్తి,” అని సంఘం వెల్లడించింది.

భారత మహిళల్లో తొలి టెస్ట్ శతకం – రంగస్వామి చరిత్ర

గౌరవంపై స్పందించిన కుంబ్లే, కర్ణాటక క్రికెట్ సమిష్టి కృషిని ప్రస్తావించాడు. “కర్ణాటక క్రికెట్ మమ్మల్ని తీర్చిదిద్దింది. మేము చేసిన సేవలు కూడా కర్ణాటక క్రికెట్‌ను బలపరిచాయి. స్టాండ్‌పై ఎవరి పేరు ఉందన్నది కాదు, మా కృషి గుర్తింపు పొందడం ముఖ్యమైన విషయం,” అని అన్నాడు.

ద్రావిడ్ కూడా ఈ గౌరవాన్ని వినయంగా స్వీకరించాడు. “చిన్నస్వామి స్టేడియంతో ఇలా అనుబంధం కలగడం గర్వకారణం. నా ప్రయాణాన్ని కర్ణాటక క్రికెట్ మలిచింది. నాకు అవకాశాలు ఇచ్చిన కోచ్‌లు, సహచరులు, అభిమానులందరికీ ఈ గౌరవం చెందుతుంది,” అని పేర్కొన్నాడు.

ఇక మహిళల క్రికెట్‌కు పునాది వేసిన మాజీ భారత కెప్టెన్ శాంత రంగస్వామి పేరును కూడా ఒక స్టాండ్‌కు పెట్టాలని సంఘం నిర్ణయించింది. భారత మహిళల్లో తొలి టెస్ట్ సెంచరీ సాధించిన రంగస్వామి, 1976 నుంచి 1991 వరకు భారత్ తరఫున 16 టెస్ట్‌లు, 19 వన్డేలు ఆడింది. మొత్తం 1,037 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత క్రికెటర్ల సంఘం అధ్యక్షురాలిగా కొనసాగుతోంది.

ఈ గౌరవంపై ఆమె మాట్లాడుతూ, “ఇది నాకే కాకుండా పరిమిత వనరులతో ఆట ఆడిన ప్రతి మహిళా క్రికెటర్‌కి లభించిన గుర్తింపు. భారత క్రికెట్ ఎంత దూరం వచ్చిందో ఇది చూపిస్తుంది,” అని ఆనందం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంతో కర్ణాటక క్రికెట్ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం చేరింది. చిన్నస్వామి స్టేడియం ఇప్పుడు ఈ ముగ్గురు లెజెండ్స్ జ్ఞాపకాలతో మరింత ప్రత్యేకంగా మారింది.

కొలంబోలో హై వోల్టేజ్ పోరుకు సిద్ధం – భారత్, పాకిస్థాన్ వేర్వేరు ప్రాక్టీస్ సెషన్‌లు