LPL Match Fixing Tamim Rehman Sentenced to Four Years Jail

లంక ప్రీమియర్ లీగ్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో కోర్టు కీలక తీర్పును వెలువరించింది. దంబుల్లా థండర్స్ జట్టు యజమాని తమీమ్ రెహమాన్ను దోషిగా తేల్చిన కోర్టు, అతనికి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా ఐదు సంవత్సరాల పాటు క్రికెట్కు సంబంధించిన అన్ని కార్యకలాపాల నుంచి నిషేధం విధించడంతో పాటు ఇరవై ఐదు మిలియన్ శ్రీలంక రూపాయల జరిమానా కూడా విధించింది.
బంగ్లాదేశ్ మూలాలకు చెందిన తమీమ్ రెహమాన్ తనపై ఉన్న ఆరోపణలను కోర్టులో అంగీకరించాడు. టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో తాను బెట్టింగ్ వ్యవహారాలు ఏర్పాటు చేశానని, ఒక ఆటగాడితో మ్యాచ్ ఫిక్సింగ్ అంశంపై చర్చించినట్లు వెల్లడించాడు.
ఈ కేసు వెలుగులోకి రావడానికి కారణం ఒక ఆటగాడు చేసిన ఫిర్యాదే. శ్రీలంక అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు కాగా, ఇది 2019లో అమల్లోకి వచ్చింది. రెహమాన్ను 2024లో పోలీసులు అరెస్టు చేశారు. కొలంబో విమానాశ్రయం నుంచి దుబాయ్కు పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కొన్ని వారాల పాటు జైలులో ఉండి బెయిల్పై విడుదలయ్యాడు.
ఈ కేసులో దంబుల్లా జట్టు మేనేజర్గా పనిచేసిన పాకిస్తాన్ పౌరుడు ముజీబ్ ఉర్ రెహమాన్పై కూడా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
లంక ప్రీమియర్ లీగ్ 2020లో ప్రారంభమైంది. శ్రీలంకలోని ఐదు నగరాల పేర్లతో ఐదు జట్లు ఈ లీగ్లో పోటీపడుతున్నాయి. 2024 నాటికి ఐదు సీజన్లు పూర్తయ్యాయి. ప్రస్తుత ఛాంపియన్లుగా జాఫ్నా కింగ్స్ నిలిచింది. ఈ జట్టు ఇప్పటివరకు నాలుగు సార్లు టైటిల్ గెలుచుకుంది.
మరిన్నివార్తలుచదవండి: 2026 టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్: జర్నలిస్టులపై ఐసీసీ నిషేధం