IPL

MS Dhoni Retirement: Huge Shock for CSK Fans as Dhoni’s IPL Future Comes Under Spotlight

by Guna SRV

ఇండియన్ క్రికెట్‌లో లెజెండ్‌గా నిలిచిన మాజీ టీమిండియా కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ప్రతీక ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్‌నే ధోనీ చివరి సీజన్‌గా భావిస్తున్నట్లు ఉతప్ప స్పష్టం చేశాడు. ప్రస్తుతం 44 ఏళ్ల వయసులో ఉన్న ధోనీ, ఈ సీజన్ ముగిసిన తర్వాత ఆటగాడిగా రిటైర్మెంట్ తీసుకుని, జట్టులో మెంటర్ పాత్రలో కొనసాగేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నాడు.

ఇటీవలి కాలంలో చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంటున్న నిర్ణయాలను గమనిస్తే ఇదే విషయం స్పష్టమవుతోందని ఉతప్ప అభిప్రాయపడ్డాడు. అనుభవజ్ఞులైన సీనియర్ ఆటగాళ్లకంటే యువ, అన్‌క్యాప్డ్ ప్లేయర్లపై సీఎస్కే ఎక్కువ దృష్టి పెట్టడం వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఉందన్నాడు. గత సీజన్ చివర్లో డెవాల్డ్ బ్రెవిస్, ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్ వంటి యువ ఆటగాళ్లు అవకాశాలను అందిపుచ్చుకుని అద్భుతంగా రాణించడం దీనికి మంచి ఉదాహరణగా పేర్కొన్నాడు.

అబుదాబిలో జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో సీఎస్కే ఈ వ్యూహాన్ని మరింత స్పష్టంగా అమలు చేసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆల్‌రౌండర్ ప్రషాంత్ వీర్‌ను, వికెట్‌కీపర్ బ్యాటర్ కార్తీక్ శర్మను ఒక్కొక్కరిని రూ.14.2 కోట్లకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ ఇద్దరూ ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధర పలికిన అన్‌క్యాప్డ్ దేశీయ ఆటగాళ్లుగా రికార్డు సృష్టించారు. మొత్తం తొమ్మిది మంది ఆటగాళ్ల కోసం సుమారు రూ.41 కోట్లను ఖర్చు చేసిన సీఎస్కే, అందులో దాదాపు రూ.28.4 కోట్లను కేవలం ఈ ఇద్దరు యువ ఆటగాళ్లపైనే వెచ్చించడం విశేషంగా మారింది.

ఇదిలా ఉండగా, ధోనీ ఇప్పటికీ లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ, వికెట్‌కీపర్‌గా జట్టుకు సేవలందిస్తున్నాడు. గత సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో మధ్యలోనే మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు కూడా స్వీకరించాడు. అయినప్పటికీ, ప్రస్తుతం జట్టులో యువ ఆటగాళ్లకు ఇస్తున్న ప్రాధాన్యం చూస్తే, ధోనీ ఆటగాడిగా కాకుండా మెంటర్‌గా మారే దిశగా ముందడుగు వేస్తున్నట్లు కనిపిస్తోందని ఉతప్ప వ్యాఖ్యానించాడు.

జియో హాట్‌స్టార్‌తో మాట్లాడుతూ ఉతప్ప స్పష్టంగా చెప్పిన మాట ఏమిటంటే, ఇక సందేహాలకు చోటు లేదని, ఐపీఎల్ 2026 ధోనీకి చివరి సీజన్ అవుతుందని. గత ఏడాది నుంచి సీఎస్కే తీసుకుంటున్న నిర్ణయాలన్నీ అదే దిశగా ఉన్నాయని ఆయన తెలిపాడు. మినీ వేలానికి ముందు రవీంద్ర జడేజాను రాజస్థాన్ రాయల్స్‌కు ట్రేడ్ చేయడం, సర్ఫరాజ్ ఖాన్, రాహుల్ చాహర్ వంటి ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడం కూడా ఈ మార్పు వ్యూహంలో భాగమేనని ఉతప్ప వివరించాడు.

ధోనీ లాంటి వ్యక్తి మెంటర్‌గా ఉంటే, మరో జడేజా లాంటి ఆల్‌రౌండర్‌ను తయారు చేయడం అసాధ్యం కాదని ఉతప్ప అభిప్రాయపడ్డాడు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీకి ధోనీ మార్గదర్శకత్వం తోడైతే, సీఎస్కే భవిష్యత్తు సరైన దిశలో సాగుతుందని పేర్కొన్నాడు. ధోనీ ఆటగాడిగా రిటైర్ అయినప్పటికీ, సీఎస్కేతో ఆయన అనుబంధం కొనసాగుతుందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదని ఉతప్ప స్పష్టం చేశాడు.

ఈ సీజన్‌లో ధోనీ మెంటర్ కమ్ ప్లేయర్ పాత్రలో కనిపించే అవకాశం ఉందని, ఇప్పటికే ఆయన ఆ దృష్టితోనే ఆలోచిస్తున్నట్లు అనిపిస్తోందని ఉతప్ప చెప్పాడు. గత ఐదు సీజన్లుగా ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, అభిమానులకు సరైన వీడ్కోలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయన ఇంకా మైదానంలో కొనసాగుతున్నాడని కూడా ఉతప్ప వ్యాఖ్యానించాడు.

మరిన్ని వార్తలు చదవండి: IPL 2026: మినీ వేలంలో ఆర్సీబీ దూకుడు.. వెంకటేష్ అయ్యర్ చేరికతో జట్టు మరింత పటిష్టం