IPL

Mumbai Indians Hit by Injury Crisis as Rohit Sharma Set to Miss More Matches

by IPL Web Desk

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ జట్టుకు గాయాల సమస్యలు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీ జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏప్రిల్ 12న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మ్యాచ్‌లో హ్యామ్‌స్ట్రింగ్ గాయం పొందిన తర్వాత రోహిత్ ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు మిస్ అయ్యాడు. అతని లేమితో జట్టు కాంబినేషన్‌లో తరచూ మార్పులు చేయాల్సి వస్తోంది.

టోర్నమెంట్ ప్రారంభానికి ముందే గాయాల సమస్య మొదలైంది. ఎడమచేతి స్పిన్నర్ అథర్వ అంకోలేకర్ మోకాలి శస్త్రచికిత్స కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్ క్యాచ్ ప్రయత్నంలో ఎడమ భుజానికి గాయం కావడంతో టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ను జట్టులోకి తీసుకున్నారు.ఇక ఓపెనర్ క్వింటన్ డి కాక్ కూడా మణికట్టు గాయం కారణంగా బయటకు వెళ్లాడు. ఇటీవలపంజాబ్ కింగ్స్  పై అజేయ సెంచరీ చేసిన డి కాక్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పై మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. దీంతో ఓపెనింగ్‌లో ర్యాన్ రికెల్టన్ ను తిరిగి తీసుకురావాల్సి వచ్చింది.

టాస్ సమయంలో మార్పులను ధృవీకరించిన హార్దిక్ పాండ్యా

టాస్ సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మార్పులను ధృవీకరించాడు. సాంట్నర్, డి కాక్ ఇద్దరూ గాయాల వల్ల అందుబాటులో లేరని చెప్పాడు. డి కాక్ స్థానంలో రికెల్టన్ ఓపెనింగ్‌కు వచ్చాడు. అదనంగా రాబిన్ మింజ్ కు అవకాశం లభించింది. సాంట్నర్ లేమితో విల్ జాక్స్ జట్టులోకి తిరిగి వచ్చాడు. ఈ మార్పులతో వాంఖెడే స్టేడియంలో మ్యాచ్ కాంబినేషన్ పూర్తిగా మారింది.

రోహిత్ శర్మ గాయం గురించి కూడా పాండ్యా అప్‌డేట్ ఇచ్చాడు. అతను ఇంకా రెండు నుంచి మూడు మ్యాచ్‌లు మిస్ అవుతాడని తెలిపాడు. ఫిట్‌నెస్ సాధించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఇంకా మ్యాచ్‌కు సిద్ధం కాలేదు. దీంతో కీలక దశలో జట్టు అతని సేవలు కోల్పోతోంది.

మే మధ్యలో రోహిత్ తిరిగి రావొచ్చని అంచనా. ముఖ్యంగా ఆర్సీబీ లేదా పంజాబ్ కింగ్స్ పై మ్యాచ్‌లలో అతని రీ ఎంట్రీ ఉండొచ్చు. అయితే ఖచ్చితమైన సమయం ఇంకా తెలియలేదు. గాయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్, బెంచ్ స్ట్రెంగ్త్‌పై ఆధారపడుతూ టోర్నమెంట్‌లో పోటీ కొనసాగించాల్సి ఉంటుంది.