Mustafizur Rahman Joins PSL After IPL Exit Lahore Qalandars Deal Big Financial Loss

బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఐపీఎల్ నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 సీజన్లో లాహోర్ ఖలందర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు అంగీకరించాడు. పీఎస్ఎల్ వేలానికి ముందే లాహోర్ ఫ్రాంచైజీ అతడిని రూ. 2.08 కోట్లకు (పాకిస్తానీ కరెన్సీలో సుమారు 6.44 కోట్లు) ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ విషయాన్ని లాహోర్ ఖలందర్స్ యజమాని సమీన్ రానా అధికారికంగా ధ్రువీకరించారు. “ముస్తాఫిజుర్ లాహోర్ ఖలందర్స్ కుటుంబంలో ఎప్పటికీ భాగమే. అతడు మళ్లీ మా జట్టులో చేరడం ఎంతో ఆనందంగా ఉంది” అని ఆయన పేర్కొన్నారు. ఈ ఫ్రాంచైజీకి ముస్తాఫిజుర్ ప్రాతినిధ్యం వహించడం ఇది మూడోసారి కావడం విశేషం.
ఐపీఎల్లో భారీ ధర.. చివరకు విడుదల
ఐపీఎల్ 2026 మినీ వేలంలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ను కోల్కతా నైట్ రైడర్స్ జట్టు రూ. 9.20 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అయితే బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరిగిన దాడుల నేపథ్యంలో, జనవరి 3న బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ అతడిని జట్టు నుంచి విడుదల చేసింది. ఈ ఘటనతో బంగ్లాదేశ్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరమయ్యాయి.
భద్రతా కారణాలతో బంగ్లాదేశ్ వైఖరి
భద్రతా కారణాలను సాకుగా చూపుతూ టీ20 ప్రపంచకప్ కోసం భారత్కు పర్యటించేందుకు బంగ్లాదేశ్ జట్టు నిరాకరించింది. ఈ పరిస్థితిలో ఐసీసీ రంగంలోకి దిగిపోయి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును ఒప్పించేందుకు ప్రయత్నించింది. అయితే బీసీబీ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
దీంతో ఐసీసీ బంగ్లాదేశ్ను టోర్నీ నుంచి తప్పించి, వారి స్థానంలో స్కాట్లాండ్ జట్టును చేర్చింది. ఈ పరిణామాలన్నింటి మధ్య ముస్తాఫిజుర్ రెహ్మాన్ అనవసరంగా బలైపోయాడు.
రూ. 7.12 కోట్ల నష్టం
ముస్తాఫిజుర్ ఐపీఎల్లో ఆడి ఉంటే రూ. 9.20 కోట్లు అందుకునేవాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల పీఎస్ఎల్ ఒప్పందం ద్వారా అతడికి కేవలం రూ. 2.08 కోట్లు మాత్రమే లభించనున్నాయి. ఫలితంగా అతడు దాదాపు రూ. 7.12 కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్లైంది.
కాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 సీజన్ ఈ ఏడాది మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది.
మరిన్నివార్తలుచదవండి: భారత్ పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్ వివాదంలో ఐసీసీ జోక్యం, మధ్యవర్తిగా ఇమ్రాన్ ఖ్వాజా